న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రపంచంలో మరే దేశంలోనూ 5జీ సేవల విస్తరణ భారత్లో ఉన్నంత వేగంగా ఉండబోదని నోకియా ఇండియా మార్కెటింగ్, కార్పొరేట్ వ్యవహారాల అధిపతి అమిత్ మార్వా అన్నారు. భారత్లో 5జీ సేవల వ్యవస్థ దాదాపు సిద్ధమైపోయిందని, మిగతా దేశాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నదని చెప్పారు. ఫారిన్ కరస్పాండెంట్ క్లబ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే దేశంలోని స్మార్ట్ఫోన్లలో 5జీ ఫోన్లు 10 శాతానికి చేరినట్టు తెలిపారు. కాగా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో దేశంలోని ఆయా ప్రాంతాల్లో 5జీ సేవలను పైలట్ ప్రాజెక్టుల కింద పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఆఖరుకల్లా జియో, మార్చి 2024 నాటికి ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్తున్నాయి. ఇదిలావుంటే చైనా పేరు ప్రస్తావించకుండా పొరుగు దేశాల నుంచి భారతీయ టెలికం రంగంలోకి సాంకేతిక చొరబాట్లు జరిగే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా అమిత్ హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.