న్యూఢిల్లీ, మార్చి 28: బ్యాంక్ల్లో తనఖా చేసిన తమ షేర్లకు పూర్తి చెల్లింపులు చేసినట్టు అదానీ గ్రూప్ వెల్లడించిన అంశంపై తాజాగా అనుమానాలు తలెత్తాయి. అదానీ చెప్పినట్టు పూర్తి చెల్లింపులు జరపలేదంటూ ఫైనాన్షియల్ వెబ్సైట్ ‘ద కెన్’ మంగళవారం ప్రచురించిన కథనంతో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు అన్నీ నిలువునా పతనమయ్యాయి. మరో వైపు రుణాల చెల్లింపు అంశంపై వివరణ ఇవ్వాలంటూ అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్కు స్టాక్ ఎక్సేంజీలు నోటీసులు పంపించాయి. షేర్లను తనఖా చేసి తీసుకున్న 2.15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.17,680 కోట్లు) రుణాన్ని మార్చి 31నాటికి తీర్చాల్సి ఉండగా, అంతకంటే ముందుగానే పూర్తిగా చెల్లించినట్టు ఈ నెల ప్రారంభంలో అదానీ గ్రూప్ ప్రకటించింది. ‘పూర్తిగా’ చెల్లించామంటూ అదానీ గ్రూప్ చెప్పినప్పటికీ, తనఖాగా ఉన్న ప్రమోటర్ల షేర్లలో అధిక శాతాన్ని బ్యాంక్లు విడుదల చేయలేదన్న విషయం రెగ్యులేటరీ ఫైలింగ్స్ చూపిస్తున్నాయని కెన్ వివరించింది. రుణం పూర్తిగా చెల్లించలేదనడానికి ఇది తార్కాణమని పేర్కొంది. మరిన్ని షేర్లను తనఖా చేసే పరిస్థితి రాకుండా, బ్యాంకులే వాటి వద్దనున్న షేర్లను విక్రయించే పరిస్థితి తలెత్తకుండా అదానీ గ్రూప్ కొంత మేర చెల్లింపులు చేసి, రుణ మొత్తాన్ని తగ్గించుకుని ఉంటుందని కెన్ తెలిపింది. తనఖా చేసినవాటిలో కేవలం అదానీ పోర్ట్స్ షేర్లనే బ్యాంక్లు విడుదల చేశాయని, చెల్లింపు ప్రకటన వెలువడి నెల కావొస్తున్నా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లను ఇంకా విడుదల చేయలేదని తెలిపింది. ‘ఇది అసాధారణమైన విషయం. రుణగ్రస్తుడు రుణాన్ని చెల్లించిన వెంటనే తనఖా షేర్లు విడుదల అవుతాయి’ అంటూ కెన్ వ్యాఖ్యానించింది.
కెన్ వార్తా కథనంపై అదానీ గ్రూప్ను స్టాక్ ఎక్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు వివరణ కోరాయి.
షేర్ల తనఖాకు సంబంధించి ఈ మార్చి త్రైమాసికం ముగింపులో కంపెనీలు సమర్పించే డాటాను స్టాక్ ఎక్సేంజీలు అప్డేట్ చేసేవరకూ వేచిచూడాలని అదానీ గ్రూప్ సీఎఫ్వో జుగేషిందర్ సింగ్ సూచించారు. 2.15 బిలియన్ డాలర్ల షేర్ల తనఖా రుణం చెల్లింపుపై ఒక ట్విటర్ పోస్ట్లో వివరణ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.