2000 Notes | ముంబై, సెప్టెంబర్ 30: రూ. 2 వేల నోట్లను మార్చుకునే గడువును రిజర్వు బ్యాంక్ పెంచింది. అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో శనివారం వరకు మాత్రమే గడువు విధించిన సెంట్రల్ బ్యాంక్..తాజాగా దీనిని మరో వారం రోజులు పెంచింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మే 19న రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3.42 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు బ్యాంకుల వద్ద జమయ్యాయి.
మొత్తం చలామణిలో ఉన్న 96 శాతం కరెన్సీ తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయి. కేవలం రూ.14 వేల కోట్ల విలువైన నోట్లు మాత్రమే మార్కెట్లో చలామణిలో ఉన్నాయని, ఇవి కూడా బ్యాంకుల్లో జమ చేయాలని ఆర్బీఐ సూచించింది. వచ్చే శనివారం వరకు బ్యాంకుల వద్ద డిపాజిట్ లేదా ఎక్సేంజ్ చేసుకునే అవకాశం కల్పించిన రిజర్వు బ్యాంక్.. ఆ తర్వాత అంటే అక్టోబర్ 7 తర్వాత ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునే అవకాశం కల్పించింది. దీనికి కొన్ని షరతులు విధించింది. ఒక్కొక్కరు కేవలం పది నోట్లు లేదా రూ.20 వేలు మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది.