న్యూఢిల్లీ : ఏడాది ఆరంభంలో టెక్ దిగ్గజాలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతూ మాస్ లేఆఫ్స్ ప్రకటించాయి. అప్పట్లో వేలాది మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయి వీధినపడ్డారు. ఆపై పలు కంపెనీలు, భిన్న రంగాలకు చెందిన సంస్ధలూ లేఆఫ్స్ బాటపట్టాయి. లేటెస్ట్గా లేఆఫ్స్పై మైక్రోసాఫ్ట్ హెచ్ఆర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ (Ex Microsoft HR VP) క్రిస్ విలియమ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తొలి క్వార్టర్లో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటాయని ఇలా చేయడం సర్వసాధారణమని పేర్కొన్నారు.
సెలవల్లో ఉద్యోగులను తొలగించడం సరైంది కాదనే కంపెనీలు ఏడాది ఆరంభంలో ఇలా చేస్తుంటాయని చెప్పారు. సెలవల్లో ఉద్యోగులపై వేటు వేయడం మంచి పద్ధతి కాదని పరిగణిస్తారని అన్నారు. సంవత్సరాంతంలో కంపెనీ ఉన్నతాధికారులు వ్యాపార పరిస్ధితిని మదింపు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. బిజినెస్ ఇన్సైడర్కి రాసిన వ్యాసంలో క్రిస్ విలియమ్స్ పలు అంశాలను ప్రస్తావించారు. పెద్ద కంపెనీల్లో మేనేజర్లు కంపెనీ నిలువెల్లా కంపించే భారీ నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.
అందుకే ఏడాది ఆరంభంలో తొలి మాసాల్లో చాలా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుంటాయని పేర్కొన్నారు. ఆర్ధిక ఒత్తిళ్లను ఎదుర్కొనే టాప్ బాస్లు ఫలితాలు త్వరగా రావాలని కోరుకుంటారని చెప్పారు. ఏడాది ఆరంభంలో లేఆఫ్స్ అందుకే సాధారణమని స్పష్టం చేశారు. ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ ఉన్నతోద్యోగులు భావించినా దాన్ని వాయిదా వేస్తుంటారని, సెలవల అనంతరమే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంటారని విలియమ్స్ వెల్లడించారు.
Read More :