Aadhaar | మీరు ఆధార్కార్డు తీసుకొని పదేళ్లు దాటిందా..? అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి! లేదంటే పాత వివరాలతో కార్డును ఏదేని క్రయవిక్రయాలు, లావాదేవీలకు ఉపయోగిస్తే తిరస్కరించవచ్చు. అందుకే ప్రభుత్వం ఆధార్కార్డు అప్డేట్కు అవకాశం కల్పించింది. జూన్ 14వరకు గడువు విధించింది. పోస్టాఫీసులు, బ్యాంకులు, శాశ్వత నమోదు కేంద్రాల్లో నవీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచిస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, మే13 : ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఆధార్ కార్డు ఉపయోగం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సిమ్కార్డు నుంచి మొదలు బ్యాంకు ఖాతా, వాహనాలు, ఇళ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు ఉపకారవేతనాల వరకు కూడా తప్పనిసరిగా మారింది. అయితే, ఆధార్ ప్రారంభించిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో, వారు అనేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తున్నది. దీనిపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు కూడా పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆధార్ కార్డుల సవరణతోపాటు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. 2014 కంటే ముందు ఆధార్ పొందిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది.
కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్14 వరకు గడువు కూడా విధించింది. దీంతో ఆధార్ సెంటర్లు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన డాక్యుమెంట్లతో క్యూలు కడుతున్నారు. చిన్నారులకు కార్డు తీసుకుని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల కింద ఆధార్ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ(యూఐడీఏఐ) సూచిస్తున్నది. సుదీర్ఘకాలం అనంతరం మార్పులకు యూఐడీఏ అవకాశం కల్పించడంతో తప్పులు సరిచేసుకునేందుకు ఏళ్లుగా వేచిచూస్తున్న వారంతా కార్డులు నవీకరించుకునేందుకు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
ప్రధానంగా 2010 -18 వరకు ఆధార్ నమోదు చేసుకున్న కార్డుదారులు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి ముందు తండ్రి పేరిట ఉన్న మహిళల కార్డులు వివాహానంతరం భర్త పేరు మార్చుకునేందుకు గతంలో వీలు లేకుండే, దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్గా మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటిని కూడా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. డబ్భు ఏళ్లు దాటిన వారికి నవీకరణలో మినహాయింపునిచ్చారు. తప్పొప్పులు సవరించుకునే వారు తమ పదో తరగతి, పాన్, ఓటర్ కార్డు, పాస్ పోర్టుల్లో ఏదో ఒకటి జతపర్చాల్సి ఉంటుంది. అందులో చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతి ముద్రలతో ఆధార్ కార్డు జారీ చేశారు. ఎలాంటి రుసుం చెల్లించకుండా ఆన్లైన్లో స్వతహాగా కూడా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. మై ఆధార్ పోర్టల్, ఎం-ఆధార్ యాప్ ద్వారా myaadhaar.uidai.gov.in పోర్టల్ ఓపెన్ చేసి ఫోన్ నంబర్ నమోదు చేశాక వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి. అనంతరం చిరునామా నిరూపించే పత్రాన్ని అప్లోడ్ చేసి సమర్పించాలి. వెంటనే ఆధార్ అప్డేట్ పూర్తయినట్లు ఫోన్ నంబర్కు మేసేజ్ వస్తుంది.
ఆధార్ సెంటర్లలో కార్డుల నవీకరణ కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై స్పష్టమైన నిబంధనలు విధించారు. బయోమెట్రిక్ అప్డేట్ కోసం 100, డెమోగ్రాఫిక్ అప్డేట్కు 50, ఆధార్ డౌన్ లోడ్, కలర్ ప్రింట్కు 30 చెల్లించాలి. అందులో సెంటర్ల నిర్వాహకులు తిరకాసు పెట్టినా, అదనంగా డబ్బులు వసూలు చేసినా, సంబంధిత ఆధార్ సెంటర్ కోడ్ నెంబర్తో టోల్ ఫ్రీ 1947 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
ఆధార్ పొంది పదేండ్లు పూర్తయిన ప్రతి ఒకరూ కార్డును అప్డేట్ చేసుకోవాలి. బ్యాంకులు, శాశ్వత ఆధార్ కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి నవీకరణ చేసుకో వచ్చు. స్వతహాగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశమున్నది. ప్రతి వ్యవహారానికి ఆధార్ ప్రామాణికంగా మారింది. కావునా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జూన్ 14 వరకు తప్పనిసరిగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి.
– సుధాకర్, అర్బన్ తహసీల్దార్