సంపాదించే ప్రతీ వ్యక్తి తన కష్టార్జితాన్ని సురక్షితమైన చోటనే ఉంచాలనుకుంటాడు. పిల్లల విద్య, పెండ్లి కోసమో.. తన పదవీ విరమణ అనంతర జీవితావసరాల కోసమో పొదుపు-పెట్టుబడులకు దిగుతూ ఉంటాడు. అయితే ఇదే సమయంలో రాబడులపై ఓ అంచనా లేక సతమతమయ్యేవారు ఎందరో. కానీ అందుకో లెక్కుంది. అదే రూల్ 72, రూల్ 114 ఫార్ములా. రూల్ 72తో మీరు పెట్టుబడి పెట్టేది రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు. అలాగే రూల్ 114తో మూడింతలయ్యేందుకు పట్టే కాలాన్ని అంచనా వేయవచ్చు.
రూల్ 72 ఫార్ములాను అర్థం చేసుకోవడానికి మీ పెట్టుబడిపై మీకొచ్చే రిటర్న్స్ను 72తో భాగించాలి. ఉదాహరణకు మీరు ఏటా లక్ష రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. దానిపై 8 శాతం వార్షిక రిటర్న్స్ను అందుకుంటున్నారు. ఇప్పుడు 72ను 8 భాగాలుగా విభజిస్తే 9 వస్తుంది. అంటే మీరు పెట్టే పెట్టుబడులు 9 ఏండ్లకు రెట్టింపు అవుతాయన్నమాట. మీ ప్రతీ లక్ష రూపాయలు 9 ఏండ్ల తర్వాత రూ.2 లక్షలుగా మారుతుంది. ఒకవేళ మన పెట్టుబడులు ఎప్పుడు నాలుగింతలవుతాయని తెలుసుకోవాలంటే.. అప్పుడు 72కు బదులు 144ను వినియోగించాలి.
144 ను 8 భాగాలుగా విభజిస్తే 18 వస్తుంది. అంటే 18 ఏండ్ల తర్వాత మీ లక్ష రూపాయలు.. రూ.4 లక్షలవుతుంది. ఒకవేళ ప్రతీ త్రైమాసికానికి మీ పెట్టుబడిపై 3 శాతం వడ్డీ అందితే 72ను 3 భాగాలుగా విభజించాలి. అంటే 24 త్రైమాసికాలు లేదా 6 ఏండ్లలో మీ పెట్టుబడి రెట్టింపవుతుందనుకోవచ్చు. అయితే దీనికీ ఓ పరిమితి ఉన్నది. 5 నుంచి 12 శాతం శ్రేణిలో రిటర్న్స్ ఉంటేనే ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఒకవేళ ఈ శ్రేణిలో లేకపోతే రూల్ 71, 73, 74ను వాడుకోవచ్చు. వడ్డీరేటులో పెరిగే ప్రతీ 3 శాతం పాయింట్లకు 72కు 1 చొప్పున కలుపుతూ పోయి ఫార్ములాను ప్రయోగించాలి. ఉదాహరణకు మీ పెట్టుబడిపై 15 శాతం రిటర్న్స్ లభిస్తే.. 73ను 15 భాగాలుగా విభజించాలి. దీన్నిబట్టి దాదాపు ఐదేండ్లలో మీ పెట్టుబడులు రెట్టింపవుతాయన్నమాట. అలాగే ఈ ఫార్ములాతో కచ్ఛితమైన రిటర్న్స్ను అంచనా వేయలేమన్న సంగతి మరువద్దు. అటుఇటుగా సదరు మొ త్తాలను అందుకోవడానికి వీలుంటుంది.
114 ఫార్ములా..
ఈ ఫార్ములాను మన పెట్టుబడులు ఎప్పుడు మూడింతలవుతాయో తెలుసుకోవడానికి వినియోగించవచ్చు. ఉదాహరణకు లక్ష రూపాయల పెట్టుబడిపై 12 శాతం రిటర్న్స్ వస్తుంటే.. 114ను 12 భాగాలుగా విభజించాలి. అప్పుడు 9.5 ఏండ్లలో పెట్టుబడులు మూడింతలవుతాయన్న అంచనాకు రావచ్చు. అలాగే ఈ ఫార్ములా ప్రకారం మన పెట్టుబడులు 6 ఏండ్లలో రెట్టింపు, 12 ఏండ్లలో నాలుగింతలవుతాయి. 9 శాతం వడ్డీ వస్తే పెట్టుబడి రెట్టింపునకు 8 ఏండ్లు పడుతుంది. 16 ఏండ్లలో నాలుగింతలువుతుంది.
ద్రవ్యోల్బణం ఎఫెక్ట్..
ఇక మీ పొదుపును ద్రవ్యోల్బణం ఎలా మింగేస్తుందో కూడా ఈ ఫార్ములాలతోనే తెలుసుకోవచ్చు. అందుకు ద్రవ్యో ల్బణం రేటుతో రూల్ 72, రూల్ 114ను ద్రవ్యోల్బణంతో లెక్కించాలి. ఉదాహరణకు ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటే.. 72ను 6 భాగాలుగా విభజించాలి. 12 వస్తుంది. దీంతో మీరు పెట్టిన పెట్టుబడుల విలువ 12 ఏండ్ల తర్వాత సగానికి పడిపోతుందనుకోవచ్చు. దీన్నిబట్టి 19 ఏండ్లకు మూడో వంతు, 24 ఏండ్లకు పావు వంతు విలువే మిగులుతుంది. అంటే ఇప్పుడు 10 రూపాయలకు దొరికే వస్తువు కోసం 12 ఏండ్ల తర్వాత మీరు 20 రూపాయలను వెచ్చించాల్సి వస్తుందన్నమాట. దీన్నిబట్టి పెట్టుబడులను పెంచుకుంటూపోతే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందుల్నైనా తేలిగ్గా జయించవచ్చు.