Gadkari On EV fire incidents | రోడ్డుపై వెళుతున్న విద్యుత్ వాహనాలు తగలబడి పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. లోపాలు ఉన్న వాహనాలను రీకాల్ చేయాల్సిందేనని ఆటోమొబైల్ సంస్థలను గురువారం ఆదేశించారు. వరుస ప్రమాదాలపై కమిటీని వేశామని గడ్కరి తెలిపారు. సదరు కమిటీ ప్రమాద కారణాలపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఆ కమిటీ నివేదిక లభించిన తర్వాత సంబంధిత ఆటోమొబైల్ సంస్థలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఆటోమొబైల్ సంస్థలకు కొత్త నిబంధనలు అమలులోకి తెస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోవడంతోపాటు భూతాపం నివారణకు భారత్తోపాటు ప్రపంచ దేశాలు విద్యుత్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈవీ బైక్స్, కార్లు, స్కూటీల విక్రయం పుంజుకుంటున్నది. కానీ ప్రారంభ దశలోనే ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడటంపై మంత్రి గడ్కరీ సీరియస్ అయ్యారు. ఓలా అధినేత భవీష్ అగర్వాల్ ఇటీవల గడ్కరీని కలుసుకున్నట్లు వార్తలొచ్చాయి.