న్యూఢిల్లీ, జనవరి 26: వచ్చే మధ్యంతర బడ్జెట్లో చెప్పుకోదగ్గ వరాలుగానీ, సంస్కరణలుగానీ, విధాన మార్పులుగానీ ఉండకపోవచ్చన్న అంచనాలు విశ్లేషకుల్లో నెలకొన్నాయి. ఏప్రిల్-మే నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడేలోగా కేంద్రం అవసరమైన సొమ్మును వ్యయపర్చడం కోసమే సాధారణ ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్గానే అది ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంచనాలకు అనుగుణంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ.. మధ్యంతర బడ్జెట్లో ‘అద్భుతమైన ప్రకటనలు’ ఏవీ ఉండబోవని, సాధారణ ఎన్నికలకు ముందు అది ఒక ఓట్-ఆన్ అకౌంట్ మాత్రమేనని అన్నారు. ఈ ఓట్-ఆన్ అకౌంట్ను పార్లమెంటు ఆమోదించిన మీదట ఏప్రిల్-జూలై నెలలకు ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన సొమ్ము ను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వం విత్డ్రా చేసుకోగలుగుతుంది. జూన్ నెలకు అటుఇటుగా ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను జూలైలో సమర్పిస్తుందని అంచనా. వాస్తవానికి మధ్యంతర బడ్జెట్లలో ప్రధాన విధాన ప్రకటనలేవీ ఉండనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సత్వర సమస్యలేవైనా ఉంటే ప్రభుత్వం తగిన చర్యల్ని తీసుకునే అవకాశం ఉంటుంది.
గ్రామీణ రంగానికి ఊతం
2023-24లో వ్యవసాయ రంగం వృద్ధి 4 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోతుందన్న అంచనాలు నెలకొన్నందున, గ్రామీణ రంగానికి ఊతమిచ్చే కొన్ని చర్యల్ని ఆర్థిక మంత్రి ప్రకటించవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వ విధానాలు యువత, మహిళలు,రైతులు, పేదల సంక్షేమానికి అనుగుణంగా ఉంటాయంటూ నిర్మలా సీతారామన్ మరో సమావేశంలో చేసిన ప్రకటన మధ్యంతర బడ్జెట్ దృష్టితో చేసిందికాదని, తమ ప్రాధాన్యతలను వివరించడమే ఇందులో ఉద్దేశ్యమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్లో దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల్ని ప్రవేశపెట్టే అవకాశం లేదని యాండర్సన్ ఇండియా చైర్మన్ రాకేశ్ నాంగియా చెప్పారు. అయితే 2019-20 బడ్జెట్లో పీయూష్ కొన్ని టాక్స్ రిబేట్లు, స్టాండర్డ్ డిడెక్షన్ రాయితీలు ప్రకటించి, పన్నుల వ్యవస్థను యథాతథంగా ఉంచారు. ఎన్నికలయ్యేంతవరకూ ప్రధాన విధాన ప్రకటనల్ని వాయిదా వేస్తారని నాంగియా అన్నారు.
మొరార్జీ రికార్డుకు సీతారామన్ చేరువ
వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సృష్టించిన రికార్డును ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమం చేయనున్నారు. తొలి పూర్తికాలపు మహిళా ఆర్థిక మంత్రి అయిన సీతారామన్ 2019 జూలై నుంచి ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టగా, ఈ ఫిబ్రవరి 1న 2024-25 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను లోక్సభకు సమర్పిస్తారు. దీంతో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డుల్ని అధిగమిస్తారు. వీరంతా ఐదేసి బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా కొనసాగిన 1959-1964 మధ్యకాలంలో ఐదు పూర్తి వార్షిక బడ్జెట్లను, ఒక మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు. మధ్యలో బ్రేక్లు వచ్చినప్పటికీ, ఆయన మొత్తంమీద 10 బడ్జెట్లు ప్రవేశపెట్టి నెలకొల్పిన రికార్డు ఇంకా పదిలంగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ 2014-15 నుంచి 2018-19 వరకూ వరుసగా ఐదు బడ్జెట్లు ఇచ్చారు. అటుతర్వాత జైట్లీ అనారోగ్యం కారణంగా 2019-20 ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.