హైదరాబాద్ (అమీర్పేట్), సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ కేంద్రంగా ఆయుర్వేద మందుల తయారీ సంస్థ జివిక ఆయుర్ సైన్సెస్ రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి సిద్ధమైంది. రూ.120 కోట్ల వ్యయంతో ఆయుర్వేద మందుల తయారీ పరిశ్రమను స్థాపించనున్నట్లు ప్రకటించింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో జివిక ఆయుర్ సైన్సెస్ వ్యవస్థాపకులు సీఈవో ఎల్ మణివర్గీస్ మాట్లాడుతూ..ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ను కలిసి తమ ఆలోచనను వివరించామని, ఇందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైందని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ యూనిట్కు జీనోం వ్యాలీలో స్థలాన్ని కూడా పరిశీలించినట్లు, ఇది ఎంతో అనుకూలంగా ఉన్నదన్నారు.
ప్రభుత్వం నుండి ఇతర అనుమతులకు సంబంధించిన అంశాలు కూడా సరళతరంగా ఉండడంతో తమ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని విధాలుగా సానుకూల పరిస్థితులున్నాయని వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వనరులు, ఆయుర్వేద మందుల తయారీకి అనువుగా ఉన్న పరిస్థితులు, మార్కెట్, జాతీయ, అంతర్జాతీయంగా అనుకూలంగా ఉన్న రవాణా సదుపాయాలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ తమ పరిశ్రమ స్థాపనకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు.
వచ్చే నెలలో 30 ఉత్పత్తులు
ఆయుర్వేద రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఒకేసారి 30 రకాల మందులను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది సంస్థ. వచ్చే నెలలో భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్లోకి ఒకేసారి ఈ మందులు అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల విక్రయాలు లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..అంతర్జాతీయంగా రూ.300 కోట్లు లక్ష్యంగా ముందుకువెళ్తున్నట్లు చెప్పారు.
150 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్లో ఏర్పాటు చేయతలపెట్టిన యూనిట్తో 150 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు మణివర్గీస్ చెప్పారు. తొలి విడుతలో వంద మందికి పైగా ఉద్యోగాలు లభించనుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను రెండు రెట్లు పెంచనున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ప్లాంట్ నిర్మాణ ప్రారంభ పనులు ప్రారంభించి మార్చి కల్లా ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడికి తరలించే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నట్లు చెప్పారు.