Gold and Silver : ఈ ఏడాది ప్రారంభంలో ఆకాశాన్నంటిన బంగారం, వెండి (Gold, Silver) ధరలు గత కొన్ని రోజుల నుంచి దిగి వస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాల మెరుపులు తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ (International Market) లో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 4377.95 డాలర్లకు దిగొచ్చి నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది.
స్పాట్ గోల్డ్ ధర తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో రోజు కావడం గమనార్హం. గతవారం ఆరంభంలో ఈ పసిడి ధర 5000 డాలర్లపైన పలికింది. అటు వెండి ధర 65.74 డాలర్లకు పతమైంది. ఇక దేశీయంగానూ ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర నేడు 4.59 శాతం తగ్గి రూ.1,37,862 వద్ద కొనసాగుతోంది. మే ఫ్యూచర్స్లో వెండి ధర 5.70 శాతం పతనమై కేజీ ధర రూ.2.13 లక్షలుగా ట్రేడవుతోంది.
హైదరాబాద్లో సోమవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,43,390గా ఉంది. కేజీ వెండి ధర రూ.2.20 లక్షలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉద్రిక్తతల ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించవచ్చన్న అంచనాలకు తోడు డాలర్ బలోపేతం కావడం.. బంగారం, వెండి ధరలపై పెను ప్రభావం చూపుతోంది.
అంతేగాక యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కూడా ఈ లోహాల ధరల పతనానికి కారణమని బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.