EPPB UPI Payments | కస్టమర్లకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తీపి కబురు అందుబాటులోకి తెచ్చింది. ఇంటి వద్ద నుంచే పలు రకాల బిల్లుల చెల్లింపులు పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. ఇందుకోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), భారత్ బిల్పేలతో జత కట్టినట్లు ఐపీపీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్ బిల్ పే ప్లాట్ఫామ్ నుంచి యుటిలిటీ బిల్లులు చెల్లించవవచ్చు. ఐపీపీబీ తన కస్టమర్లతోపాటు ఇతరులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి తేనున్నది.
దీంతో కస్టమర్లు ఇంటి నుంచే మొబైల్ పోస్ట్పెయిడ్, కేబుల్ నెట్వర్క్ రీచార్జీతోపాటు పిల్లల స్కూళ్లు, కాలేజీల ఫీజులు చెల్లించొచ్చు. ఇంటి వద్ద నుంచి గానీ, సమీప పోస్టాఫీసు నుంచి గానీ ఈ సేవలు పొందొచ్చు. వివిధ యుటిలిటీ బిల్లులు, రీచార్జీల తేదీలను గుర్తు చేసేలా అలర్ట్స్, రిమైండర్లు సెట్ చేసుకోవచ్చు. నగదు రూపంలో రికరింగ్ బిల్లులు చెల్లించవచ్చు. నోటిఫికేషన్లు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.
బిల్లుల పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్పై ఆన్ లైన్ ఫిర్యాదులను నమోదు చేయడంతోపాటు వాటి పరిస్థితిని తెలుసుకోవచ్చు. మొబైల్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్, కేబుల్ టీవీ సబ్స్క్రిప్షన్ ఫీజు, స్కూల్ ఫీజు, విద్యుత్, గ్యాస్, వాటర్, ఫాస్టాగ్ రీచార్జీ, వివిధ రుణాలపై ఈఎంఐ చెల్లింపులు, హెల్త్, బీమా ప్రీమియం, మున్సిపల్ బిల్లులు తదితరాలు చెల్లించవచ్చు.