EPFO Auto-Settlement : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ-EPFO) తన ఖాతాదారులకు ఊరటనిచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఏళ్లుగా వాడకంలో లేకుండా మూతపడిన పీఎఫ్ ఖాతాల (PF Accounts) లోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమెటిక్గా సెటిల్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ సెటిల్మెంట్ వ్యవస్థ (Automated Settlement System) ను తీసుకురానుంది.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఖాతాదారులు ఎలాంటి క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయి. నివేదికల ప్రకారం.. తొలి దశలో భాగంగా ఆధార్ వెరిఫై అయిన సుమారు 8 లక్షల ఇనాక్టివ్ ఖాతాలను ప్రాసెస్ చేయనున్నారు. ఈ ఖాతాల్లో దాదాపు రూ.5,200 కోట్ల నిధులు ఉన్నట్లు అంచనా. వాటిలో 14 వేల ఖాతాల్లో రూ.5 లక్షలకుపైగా, 38,000 ఖాతాల్లో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య నిధులు ఉన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల ఇనాక్టివ్ ఖాతాలు ఉన్నట్లు ఈపీఎఫ్వో అధికారులు గుర్తించారు. వాటిలో రూ.10,181 కోట్ల డిపాజిట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నట్లు సమాచారం. ఈ ఖాతాల్లో 7 లక్షల ఖాతాలు 20 ఏళ్లకు పైబడినవి కాగా, 18 లక్షల ఖాతాలు 10 నుంచి 20 ఏళ్ల మధ్య కాలానికి చెందినవి. ఒక ఉద్యోగి 55 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసి, వరుసగా మూడేళ్లపాటు ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయకపోతే ఆ ఖాతాను ఇన్యాక్టివ్గా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలపై వడ్డీ జమ ఆగిపోతుంది.
ఇప్పటికే రూ.1,000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ ఖాతాలను ఆటోమేటిక్గా సెటిల్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. తాజా ప్రతిపాదన దీనికి కొనసాగింపుగా భావిస్తున్నారు. అయితే ఈ నివేదికలపై ఈపీఎఫ్వో నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.