ఈపీఎఫ్ వడ్డీ రేటుపై ధర్మకర్తల బోర్డు నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 4: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లకు చెల్లించే వడ్డీలో ఎలాంటి మార్పు లేదు. దేశంలో ఐదు కోట్ల మందికి పైగా ఉన్న ఈపీఎఫ్ డిపాజిటర్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 8.50 శాతం వడ్డీనే చెల్లించాలని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన ఈపీఎఫ్వో కేంద్ర ధర్మకర్తల బోర్డు (సీబీటీ) గురువారం జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో 8.50 శాతం వడ్డీ జమచేయాలని సీబీటీ సిఫారసు చేసినట్లు కార్మిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈపీఎఫ్ వడ్డీ రేటుపై సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు తెలియజేస్తారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత ఉద్యోగ భవిష్య నిధి చందాదారుల ఖాతాల్లో 8.50 శాతం వడ్డీని జమ చేస్తారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గవచ్చని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. కరోనా సంక్షోభంతో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేందుకు చాలా మంది ఈపీఎఫ్ చందాదారులు తమ ఖాతాల నుంచి నగదును ఉపసంహరించుకున్నారు. గతేడాది డిసెంబర్ చివరి నాటికి దాదాపు 2 కోట్ల మంది చందాదారులు రూ.73 వేల కోట్లను వెనక్కి తీసుకున్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి (మార్చి 31) నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది. మరోవైపు ఈపీఎఫ్ డిపాజిట్లు కూడా గణనీయంగా తగ్గిపోవడంతో ఈసారి వడ్డీ రేటు తగ్గించవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఈపీఎఫ్వో మాత్రం వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును 2019-20లో 8.50 శాతానికి తగ్గించారు. అంతకుముందు ఏడేండ్లతో పోలిస్తే ఇదే అతితక్కువ వడ్డీ రేటు.