ముంబై, మే 10: ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 10 శాతం వృద్ధిచెంది రూ. 3,987 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 3,621 కోట్లు కాగా, తాజా త్రైమాసికంలో రూ.4,200 కోట్లకుపైగా లాభాన్ని ఆర్జించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా 10 శాతం వృద్ధితో రూ. 52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు పెరిగింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 24 చొప్పున తుది డివిడెండ్ను సిఫార్సుచేసింది. అలాగే గత ఏడాది తొలిసారిగా రూ.2 లక్షల కోట్లకుపైగా విలువైన ఆర్డర్లను అందుకున్నామని సంస్థ తెలియజేసింది.
ఎల్అండ్టీకి గత కొన్ని దశాబ్దాలుగా నేతృత్వం వహించిన ఏఎం నాయక్ కంపెనీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నాయక్ నిర్ణయించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆయన వైదొలుగుతారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు నాయక్కు గౌరవ చైర్మన్ హోదా ఇచ్చింది. ప్రస్తుత సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంను కంపెనీ బోర్డు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఈ నియామకం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కంపెనీలో 58 ఏండ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన నాయక్ అత్యధిక కాలం సీఎండీగా ఉన్నారు.