హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల బలోపేతానికి కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆయా ఉత్పత్తులకు మార్కెట్ను పెంచేలా వివిధ దేశాల్లో ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్లు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (ఐసీ), మార్కెటింగ్ అసిస్టెంట్స్ పథకాల కింద వచ్చే ఏడాది మార్చి వరకు ఏర్పాటు చేయనున్న ప్రదర్శనలను ఖరారు చేశారు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఆభరణాలు, బొమ్మలు, హెల్త్కేర్, మల్టిపుల్ ప్రోడక్ట్స్, వస్ర్తాలు, సివిల్ కన్స్ట్రక్షన్-ఆర్కిటెక్చర్, చర్మ ఉత్పత్తులు, కెమికల్స్, ప్రింటింగ్ తదితర ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. కాగా, ఆయా రాష్ర్టాల్లోని పరిశ్రమల సంఘాలు, సంబంధిత ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శనల్లో పాల్గొనే ఎంఎస్ఎంఈ ప్రతినిధులను ఎంపిక చేయనున్నారు.
ఉత్పత్తులకు సరైన మార్కెట్ను చూపడంతోపాటు ఎగుమతులను పెంచడం, వివిధ పరిశ్రమల మధ్య జాయింట్ వెంచర్లకు అవకాశాలు కల్పించడం, కొత్త టెక్నాలజీలపై అవగాహనపట్ల ప్రధానంగా దృష్టి పెట్టారు. బయ్యర్-సెల్లర్ మీట్లు, అంతర్జాతీయ సదస్సులు, వర్క్షాప్లను నిర్వహిస్తారు. దీంతోపాటు ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ (పీఅండ్ఎంఎస్) స్కీం కింద దేశీయ మార్కెట్లను అభివృద్ధి చేయడం, కొత్తగా ఇతర ప్రాంతాలకు మార్కెట్ను విస్తరించేలా చర్యలు తీసుకుంటారు. ఈ నెల 29న చైనాలో కెమికల్స్, 30న లుఫ్తాన్సాలో ఫ్యాషన్ అండ్ అప్పారెల్, అక్టోబర్ 4 నుంచి కతార్లో కన్స్ట్రక్షన్స్, 26న దక్షిణాఫ్రికాలో హెల్త్కేర్, నవంబర్ 2 నుంచి అమెరికాలో ఆటో పార్ట్స్, 5న చైనాలో మల్టిపుల్ ప్రోడక్ట్స్ తదితర ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.