జహీరాబాద్, సెప్టెంబర్ 9: పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్..వెనక బడిన జిల్లాల్లో సైతం పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొస్తున్న సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. దీంట్లోభాగంగానే వెనకబడిన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి(నిమ్జ్)ను ఏర్పాటు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల్లో నిమ్జ్ ఏర్పాటుకు ప్రభుత్వం 12,635 ఎకరాల భూమిని సేకరిస్తున్నది. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. దీంతో నిమ్జ్కు మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులను సర్కార్ వెచ్చిస్తున్నది.
ఇందులో భాగంగా నిమ్జ్కు 65వ జాతీయ రహదారి నుంచి ప్రత్యేకంగా రవాణా సదుపాయాలు కల్పించడానికి ఆరు లైన్లలో రోడ్డును నిర్మిస్తున్నది. 9.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రత్యేక రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 65 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే అక్కడి రెవెన్యూ అధికారులు సేకరించగా..మరో ఐదు ఎకరాల భూమికి సంబంధించి కోర్టు కేసు ఉండటంతో పెండింగ్లో ఉన్నది. కోర్టు ఆదేశాలు రాగానే ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నారు. ఇప్పటికే రైతులకు నష్ట పరిహారంగా ప్రభుత్వం రూ. 7.50 కోట్లు చెల్లించింది. ఈ నిమ్జ్ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి.
విశాలమైన రోడ్లు..
నిమ్జ్లో ఉత్పత్తి చేసే పరికరాలను భారీ వాహనాల్లో వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు 65వ జాతీయ రహదారికి లింక్ రోడ్డును ఆరు లైన్లతో నిర్మిస్తున్నారు. డిసెంబర్ నాటికి రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులను వేగవంతం చేస్తున్నారు. రైతులు సహకరించి ముందుకు వస్తే నవంబర్ చివరిలోగా పనులు పూర్తిచేసి ప్రభుత్వానికి రోడ్డు అప్పగిస్తామని అధికారులు అంటున్నారు. కొందరు రైతులు రోడ్డు పనులు అడ్డుకోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.