న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రభుత్వరంగ బీమా సంస్థల ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. బీమా సంస్థలను బలహీన పరుచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా జనవరి 4న సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ది జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(జేఎఫ్టీయూ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ బీమా సంస్థలను మూసివేయడం లేదా విలీనం, పునర్ వ్యవస్థీకరించే ప్రతిపాదనలో ఉన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న పలు ఆఫీస్లను మూసివేయడంతో వెయ్యి మంది ఉపాది కోల్పోయినట్లు జేఎఫ్టీయూ హెచ్చరించింది. నాలుగు ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరు వచ్చే నెల 4న జరగనున్న సమ్మెలో పాల్గొనే అవకాశాలున్నాయి.