న్యూఢిల్లీ, జూలై 29: సాఫ్ట్వేర్ సర్వీసుల కంపెనీల్లో భారీ రిక్రూట్మెంట్లు జరగడం, ఆ రంగంలో పెరుగుతున్న డిమాండ్కు సంకే తం. కానీ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇందుకు వైవిధ్యమైన సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ కంపెనీ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలివెళ్లడంతో శరవేగంగా నియమకాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది. ఉద్యోగుల వలసల్ని పూరించేందుకు కంపెనీ ఈ ఏడాది 1,00,000 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు గురువారం కాగ్నిజెంట్ ప్రకటించింది. 2021లో అనుభవం కలిగిన నిపుణులతో పాటు 30,000 మంది ప్రెషర్స్ను తీసకుంటామని, 2022లో 45,000 మంది కొత్త గ్రాడ్యుయేట్స్ను చేర్చుకుంటామని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హాంప్షైర్స్ చెప్పారు. జూన్ క్వార్టర్ ఫలితాల్ని వెల్లడించిన సందర్భంగా అనలిస్టులతో మాట్లాడుతూ ఉద్యోగుల వలస తమకు ప్రధాన ఆందోళనగా ఉందని చెప్పారు. ఈ జూన్ క్వార్టర్లో కంపెనీ నుంచి వలసలు రికార్డుస్థాయిలో 31 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మేర ఉద్యోగులు ఉండగా, ఇండియాలో 2 లక్షల మంది పనిచేస్తున్నారు. వలసలు తగ్గించడానికి జీతాల పెంపు, ప్రమోషన్లు, నైపుణాల్ని పెంపొందించడం, జాబ్ రొటేషన్లు, రిటెంన్షన్ డాలర్లు వంటి పలు చర్యల్ని చేపట్టామని హాంప్షైర్స్ తెలిపారు.
నికరలాభంలో 42 శాతం వృద్ధి&
ఈ జూన్ క్వార్టర్లో కాగ్నిజెంట్ నికరలాభం 41.8 శాతం వృద్ధిచెంది 512 మిలియన్ డాలర్లకు (రూ.3,802 కోట్లు) చేరింది. కంపెనీ ఆదాయం 14.6 శాతం వృద్ధితో 4 బిలియన్ డాలర్ల నుంచి 4.6 బిలియన్ డాలర్లకు (రూ.34,200 కోట్లు) పెరిగింది. 2021 జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో తమ ఆదాయం 4.69-4.74 బిలియన్ డాలర్ల మేర (10-11 శాతం వృద్ధి) ఉండవచ్చని, కాగ్నిజెంట్ గైడెన్స్ను ప్రకటించింది.