న్యూఢిల్లీ, నవంబర్ 19: గోల్డ్ లోన్లకూ త్వరలో ఈఎంఐలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా తదితర రుణాలకే నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) సౌకర్యం ఉన్నది. బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే అప్పులకు ఈ సదుపాయం లేదు. అయితే ఈ రుణాల మంజూరులో ఆర్బీఐ రకరకాల లోపాలను గుర్తించింది. దీంతో బ్యాంకులు, గోల్డ్ లోన్ కంపెనీల వంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు బంగారంపై రుణాలకూ ఈఎంఐలను తేవాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇదీ సంగతి..
బంగారు ఆభరణాలను తనఖా పెట్టి తీసుకునే రుణాల్లో లోపాలను గుర్తించామని ఈ సెప్టెంబర్ 30న ఓ సర్క్యులర్లో ఆర్బీఐ తెలిపింది. విలువ, పరిశీలన, రుణగ్రహీత ఆర్థిక సామర్థ్యం, వేలం వంటి అంశాల్లో బ్యాంకులు, రుణదాతలు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తారా? లేదా? అన్నది చూడాలని ఆర్బీఐ అంటున్నది. దీంతో ఈఎంఐ ఆధారిత వ్యవస్థను గోల్డ్ లోన్లకూ తేవాలనుకుంటున్నట్టు బ్యాంకర్లు చెప్తున్నారు. కాగా, సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు రూ.1.4 లక్షల కోట్ల గోల్డ్ లోన్లను ఇచ్చాయి. గతంతో పోల్చితే 51 శాతం పెరిగాయి.