న్యూయార్క్ : ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వైదొలగడంపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ట్విట్టర్ కొనుగోలు కోసం అవసరమైన ఆర్ధిక వివరాలను కోరుతూ కంపెనీ న్యాయవాదులు తనకు సమస్యలు సృష్టిస్తున్నారని ఈ ఒప్పందం నుంచి వైదొలగే ముందు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్కు టెక్ట్స్ మెసేజ్ పంపినట్టు వెల్లడైంది. సోషల్ మీడియా దిగ్గజం దాఖలు చేసిన దావాలో ఈ సమాచారం బయటకు వచ్చింది.
ట్విట్టర్ డీల్కు సంబంధించి నిధుల సమీకరణ సమాచారం ఆధారంగా మీ న్యాయవాదులు తనకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, దీన్ని తక్షణం ఆపాలని కోరుతూ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్వో నెడ్ సెగల్కు జూన్ 28న టెక్ట్స్ మెసేజ్లు పంపినట్టు లా సూట్లో ప్రస్తావించారు. ట్విట్టర్ డీల్ను ఎలా పూర్తి చేస్తారు, నిధుల సమీకరణ వివరాలపై మస్క్ను సోషల్ మీడియా దిగ్గజం అడిగిన అనంతరం మస్క్ ఈ వార్నింగ్ మెసేజ్లను అగర్వాల్, సెగల్కు పంపారు.
ఇక ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి మాస్క్ వెనుదిరిగిన ఉదంతం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఈ ఒప్పందంపై మస్క్కు ఆసక్తి లేదని ఆయన పలు ట్వీట్ల ద్వారా సంకేతాలు పంపారు. ట్విట్టర్ ఒప్పందాన్ని నిలిపివేసినట్టు మస్క్ తొలుత ట్వీట్ చేసి భారీ డీల్పై సందిగ్ధతకు తెరలేపారు. స్పామ్ బాట్స్పై సమాచారం ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైతే డీల్ నుంచి వైదొలగుతానని మస్క్ హెచ్చరించారు. ఇక ఒప్పందం నుంచి మస్క్ వెనుదిరగకుండా నిరోధించేందుకు ట్విట్టర్ న్యాయ పోరాటం చేపట్టింది.