Elon Musk Charity | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో 50 లక్షల సంస్థ షేర్లు విరాళంగా అందజేశారు. ప్రపంచదేశాల్లోని చిన్నారుల ఆకలి తీర్చేందుకు బిలియనీర్లు ముందుకు రావాలన్న ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే పిలుపునకు ఎలన్మస్క్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్లో దాఖలు చేసిన ఫైలింగ్లో తెలిపారు. గతేడాది నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నుంచి 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు చూపారు.
గతేడాది నవంబర్ 19-29 మధ్య షేర్ల సగటు ధర ప్రకారం వాటి విలువ 570 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళంగా నిలువనున్నది. అయితే, ఎలన్ మస్క్ విరాళం అందజేసిన స్వచ్ఛంద సంస్థ పేరేమిటన్న విషయమై స్పష్టతనివ్వలేదు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్లో సమర్పించిన ఫైలింగ్లోనూ మస్క్ ఆ వివరాలు వెల్లడించలేదు.
బిలియనీర్లు తలుచుకుంటే కోట్ల మంది నిరుపేదల ఆకలి తీర్చొచ్చని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డైరెక్టర్ డేవిడ్ బేస్లే ఇటీవల చెప్పారు. ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చడానికి రూ.45 వేల కోట్లు (600 కోట్ల డాలర్లు) అవసరం అని ట్వీట్ చేశారు. దీనిపై అప్పుడే ఎలన్మస్క్ స్పందించారు. ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రణాళికేమిటో చెప్పడంతోపాటు ఆ నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే 600 కోట్ల డాలర్ల విలువ గల షేర్ల విక్రయానికి సిద్ధం అని చెప్పారు. అన్నట్లే తన కంపెనీ షేర్లను విరాళంగా అందజేశారు.