Elon Musk | జిప్ 2 అనే సంస్థను 1995 లో స్థాపించిన ఎలాన్ మస్క్.. ఇప్పటికి ఆరు అంతర్జాతీయ సంస్థలకు అధిపతిగా ఉన్నారు. వీటిలో ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి వాటిని చెప్పుకోవచ్చు. ఇటీవలనే ఆయన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసి మూడు నెలల క్రితం తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. అప్పటినుంచి లాభదాయకమైన వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో ట్విట్టర్లో అనేక మార్పులు తీసుకొచ్చాడు. బ్లూ టిక్ సేవలను 8 డాలర్లకు అందుబాటులో పెట్టాడు.
ఇలాఉండగా, మరో అమెరికా బేస్డ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమైనట్లు సమాచారం. ఈసారి కార్పొరేట్ మీడియాను కొనుగోలు చేసేందుకు ఉవ్వీళ్లూరుతున్నట్లు తెలుస్తున్నది. వాల్స్ట్రీట్ సిల్వర్ అనే ట్విట్టర్ యూజర్కు తన ఆలోచనను వెల్లడించినట్లు పోస్టులను బట్టి అర్ధమవుతున్నది. అమెరికా బేస్డ్ ఆన్లైన్ ఫ్లాట్ఫాం అయిన సబ్స్టాక్ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. 2017 లో స్థాపించిన ఆన్లైన్ ప్లాట్ఫాం రచయితలు తమ డిజిటల్ వార్తాలేఖలను నేరుగా చందాదారులకు పంపేందుకు అనుమతిస్తుంది.
మరోవైపు, ట్విట్టర్కు కొత్త సీఈఓ కోసం మస్క్ వెతుకుతున్నాడు. ఎవరైనా మూర్ఖుడు రాగానే తన బాధ్యతల్ని అప్పగిస్తానని ఇటీవల ట్విట్టర్లో పోల్ సందర్భంగా మస్క్ చెప్పాడు. అయితే, సాఫ్ట్వేర్, సర్వర్ టీమ్లను మాత్రం తానే చూసుకుంటానని స్పష్టం చేశారు. కాగా, ట్విట్టర్ను కొనుగోలు చేసిన అనంతరం ఎలాన్ మస్క్ సంపద నిత్యం కోట్లల్లో ఆవిరైపోతుండటం విశేషం.