EV Charging | దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో విద్యుత్ వాహనాల వాడకం మొదలైంది. విద్యుత్ వాహనాలకు బ్యాటరీ చార్జింగ్ కీలకం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వాసులు కూడా విద్యుత్ వాహనాలు వాడుతున్నారు. వారి విద్యుత్ వాహనాల బ్యాటరీ చార్జింగ్కు రేట్లు ఖరారైనట్లు తెలుస్తున్నది. ఈవీ చార్జింగ్కు సర్వీస్ చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలియవచ్చింది. జీఎస్టీ కూడా అదనం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ రేట్లు అమలులోకి వస్తాయని సమాచారం.
ఒక కిలోవాట్ యూనిట్ విద్యుత్ చార్జింగ్కు రూ.12.02 చెల్లించాల్సి ఉంటుందని వినికిడి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 118 వెహికల్ చార్జింగ్ స్టేషన్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎస్ఆర్సీడీసీవో) ప్రకటించింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ విహికల్స్ (ఫేమ్)-2 స్కీం కింద ఈ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నది.
విద్యుత్ వాహనాల వాడకాన్ని భారీ పరిశ్రమలశాఖ ప్రోత్సహిస్తున్నది. 118 ఈవీ చార్జింగ్ స్టేషన్లతోపాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో మరో 20 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో కలిపి మొత్తం 138 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. అన్ని చార్జింగ్ స్టేషన్లు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం అవుతాయని తెలుస్తున్నది. హైదరాబాద్ నగర పరిధిలో ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లు.. ప్రైవేట్ వ్యక్తులు.. సంస్థల ఆధీనంలోనే ఉంటాయి.
ప్రభుత్వ రంగ చార్జింగ్ స్టేషన్లలో ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేస్తాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కంటే రూ.12.02లకే కిలోవాట్ విద్యుత్ చార్జింగ్ చాలా చౌక అని టీఎస్ఆర్ఈడీసీవో వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు ఒక కారుకు పూర్తి చార్జింగ్ చేయాలంటే 25 యూనిట్లు కావాలి. అంటే మొత్తం రూ.300 చెల్లించాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు.