ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ టాప్గేర్లో దూసుకుపోతున్నది. కంపెనీకి చెందిన వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో మూడో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తమిళనాడులోని హోసుర్ వద్ద ఏర్పాటు చేసిన రెండో ప్లాంట్ను బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ స్వప్నిల్ జైన్ మాట్లాడుతూ..దేశీయంగా సంస్థకు చెందిన ఈవీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, దీంతో మూడో ప్లాంట్ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కడ ఏర్పాటు చేసే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ తో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 4.2 లక్షల యూనిట్లకు చేరుకోనున్నది. మూడో ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీ కెపాసిటీ 14 లక్షలు. ప్రస్తుతం సంస్థ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ (450 ఎక్స్, 450 ప్లస్) మోడళ్లను విక్రయిస్తున్నది. వచ్చే 2-3 ఏండ్లలో 5-10 మోడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే మార్చి నాటికి 95 నగరాల్లో 350 ఎక్స్పీరియన్స్ సెంటర్లను నెలకొల్పాలనుకుంటున్నారు.