WazirX | తమ బ్యాంకు ఖాతాల లావాదేవీలు త్వరలో ప్రారంభం అవుతాయని దేశీయ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ `వజీర్ఎక్స్` ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా `వజీర్ఎక్స్` బ్యాంకు ఖాతాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెలలో స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. వజీర్ ఎక్స్ నిర్వహిస్తున్న జన్మాయి లాబ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఒక డైరెక్టర్తోపాటు 16 ఫిన్టెక్ కంపెనీలు, ఇన్స్టంట్ లోన్ యాప్స్పై మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఖాతాలను ఈడీ జప్తు చేసింది. వజీర్ఎక్స్ బ్యాంకు ఖాతాల్లో రూ.64.67 కోట్ల నిల్వలు ఉన్నాయి.
ఇన్స్టంట్ లోన్ యాప్స్ కేసులో 10 క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు రూ.1000 కోట్లకు పైగా హవాలా లావాదేవీలు జరిగాయన్న అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ లోన్ యాప్స్లో అత్యధికం చైనా లింక్ ఉన్నవే. లోతుగా అంతర్గత దర్యాప్తు జరిపిన తర్వాత 2020-2021లో అనుమానాస్పద లావాదేవీలు జరిపిన యూజర్లను వజీర్ఎక్స్ గుర్తించింది. ఇలా అనుమానాస్పద లావాదేవీలు జరిపిన యూజర్ల సమాచారం తెలియచేయాలని వజీర్ఎక్స్ను ఈడీ కోరింది.
ఈడీ దర్యాప్తునకు సహకరిస్తూ.. హవాలా లావాదేవీల నిరోధక చర్యలు తీసుకోవడం జరిగిందని వజీర్ ఎక్స్ తెలిపింది. తమ సంస్థకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను అన్ఫ్రీజ్ చేసిందని, త్వరలో తమ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుకోవచ్చునని వజీర్ ఎక్స్ వెల్లడించింది. తమకు అనుమానిత ఫిన్టెక్, ఇన్స్టంట్ లోన్ యాప్ సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని వజీర్ ఎక్స్ వివరణ ఇచ్చింది.