న్యూఢిల్లీ : చైనా మొబైల్ ఫోన్ దిగ్గజం వివోకు చెందిన 48 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివో సహా అనుబంధ కంపెనీలకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. ఆయా ఖాతాల్లో రూ 66 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు సహా రూ 465 కోట్లను సీజ్ చేసింది. భారత్ టర్నోవర్లో దాదాపు 50 శాతంతో సమానమైన రూ 62,476 కోట్లను వివో ఇండియా చైనాకు తరలించిందని ఈడీ పేర్కొంది.
భారత్లో పన్ను చెల్లింపులను ఎగవేసేందుకు భారత కంపెనీల్లో భారీ నష్టాలను చూపేందుకే ఈ నిధులను వివో చైనాకు తరలించినట్టు ఈడీ గుర్తించింది. వివో సహా భారత్లో దాని 23 అనుబంధ కంపెనీలపై ఈడీ చేపట్టిన సోదాల్లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద రెండు కిలోల గోల్డ్ బార్స్, రూ 73 లక్షల నగదును దర్యాప్తు ఏజెన్సీ సీజ్ చేసింది.
కాగా, వివో స్కాం ప్రధాన సూత్రధారి బిన్ లూ భారత్ను విడిచివెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. భారత్ అంతటా వివోను విస్తరించే బాధ్యతలను బిన్ లూకు అప్పగించగా ఆయన చట్ట విరుద్ధ కార్యకలాపాలకు తెగబడ్డాడు. వివో పోన్ల డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి భారత్లో 23 కంపెనీలకు బిన్ లూ కామన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన చాలా కాలంగా భారత్ను విడిచివెళ్లాడని ఇప్పటివరకూ తిరిగి రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.