Joyalukkas | కేరళ కేంద్రంగా దేశవ్యాప్తంగా బంగారం, ఆభరణాల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రముఖ బులియన్ వ్యాపార సంస్థ జోయలుక్కాస్కు చెందిన రూ.305 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. హవాలా మార్గాల్లో దుబాయికి భారీ మొత్తంలో నిధులు మళ్లించిందని జోయలుక్కాస్పై ఈడీ అభియోగం. ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై జోయలుక్కాస్కు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది.
త్రిచూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు పలు చోట్ల ఈ నెల 22న ఈడీ సోదాలు నిర్వహించింది. `ఆయా ప్రాంతాల్లో జరిపిన దాడులు, సోదాల్లో 33 స్థిరాస్తులు (రూ.81.54 కోట్లు) జప్తు చేసింది. అందులో భూమితోపాటు త్రిచూర్లోని శోభాసిటీలో నివాస భవనం, రూ.91.22 లక్షల విలువ గల మూడు బ్యాంక్ ఖాతాలను స్తంభింప జేసింది. వీటితోపాటు రూ.5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్డ్ డిపాజిట్లు, జోయలుక్కాస్కు చెందిన షేర్లు (రూ.217.81 కోట్లు) జప్తు చేసినట్లు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.
జోయలుక్కాస్కు చెందిన రూ.305.84 కోట్ల వివిధ ఆస్తులను ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ కింద జప్తు చేశామని ఈడీ వెల్లడించింది. `చట్ట విరుద్ధ మార్గాల్లో జోయలుక్కాస్ భారత్ నుంచి దుబాయికి భారీ మొత్తంలో నిధులు మళ్లించారు. జోయలుక్కాస్కు వర్గీస్కి చెందిన సొంత సంస్థ జోయలుక్కాస్కు జ్యువెల్లరీ ఎల్ఎల్సీ (దుబాయి) లో పెట్టుబడులు పెట్టింది` అని ఈడీ పేర్కొంది. హవాలా లావాదేవీల్లో జోయలుక్కాస్ తెలివిగా వ్యవహరించినట్లు తమ సోదాల్లో సాక్షాధారాలు లభించాయని తెలిపింది. సంస్థ అధికారిక పత్రాలు, ఈ-మెయిల్స్ ద్వారా హవాలా లావాదేవీలు జరిపినట్లు ధృవీకరించినట్లు ఈడీ వివరించింది.