న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది. భూమి, భవనాలు, షేర్ హోల్డింగ్స్, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాల రూపంలో ఈ ఆస్తులున్నాయి.
కేఎస్బీఎల్తో పాటు సీఎండీ పార్ధసారధి ఇతరులపై మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఈడీ గతంలో రూ 1984 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ ఇప్పటికే కంపెనీ సీఎండీ సీ. పార్ధసారధి, గ్రూప్ సీఎఫ్ఓ జీ హరికృష్ణను అరెస్ట్ చేయగా వారు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
క్లయింట్ల షేర్లను అక్రమంగా తనఖా పెట్టి కార్వీ గ్రూపు రూ 2800 కోట్ల రుణాలను పొందిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఎన్ఎస్ఈ, సెబీ ఉత్తర్వులకు అనుగుణంగా క్లయింట్ సెక్యూరిటీలను విడుదల చేసిన అనంతరం ఈ రుణాలు నిరర్ధక ఆస్తులుగా (ఎన్పీఏ) పేరుకుపోయాయి. ఈ నిధలను కంపెనీ అనుబంధ సంస్ధలకు మళ్లించిందని ఈడీ పేర్కొంది.