Amway Money Lounder | డైరెక్ట్ సెల్లింగ్ పేరిట మనీ లాండరింగ్ లావాదేవీలు జరిపిన ఆమ్వే సంస్థకు చెందిన రూ.758 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ పేరుతో ఆమ్వే మోసానికి పాల్పడుతున్నదంటూ ఈడీ సోమవారం ఆరోపణలు చేసింది. ఆమ్వే.. మనీ లాండరింగ్ లావాదేవీలను జరిపిందని తెలిపింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఆమ్వే ఫ్యాక్టరీ భవనం, భూమి, ప్లాంట్, యంత్రాలు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు జప్తు చేసినట్లు వెల్లడించింది.
36 వివిధ బ్యాంకుల ఖాతాల్లో ఉన్న రూ.345.94 కోట్ల నిల్వ నిధులను, రూ.411.83 కోట్ల విలువ గల చిర-స్థిరాస్తులను స్వాధీనం చేసుకుంది. 2002-03 నుంచి 2021-22 మధ్య వ్యాపార లావాదేవీల్లో రూ.27,562 కోట్లు సేకరించిందని ఈడీ వివరించింది. అందులో భారత్, అమెరికాల్లోని డిస్ట్రిబ్యూటర్లు, సభ్యులకు రూ.7,588 కోట్లు కమీషన్ రూపేణా చెల్లించిందని తెలిపింది.
ఆమ్వే డిస్ట్రిబ్యూటర్లు, ఏజంట్లకు వాటి ఉత్పత్తుల విక్రయాలపై శిక్షణ అందించిన బ్రిట్ వరల్డ్ వైడ్, నెట్వర్క్ ట్వింటీవన్ సంస్థలపై కూడా నిఘా కొనసాగుతున్నది. సభ్యుల మధ్య ఈ పిరమిడ్ స్కీం ప్రోత్సాహించడంలో ఈ రెండు సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ రెండు సంస్థల ప్రమోటర్లు తమ విలాసవంతమైన జీవన విధానాన్ని చాటిచెప్పేలా భారీ కార్యక్రమాలు నిర్వహించారని, సోషల్ మీడియా ద్వారా ఇన్వెస్టర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి.