హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రుణ ఎగవేత కేసులో వీఎంసీఎస్ఎల్ డైరెక్టర్ వి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియమ్ను రూ.3,316 కోట్ల మేర నష్టపరిచారని, మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, టెలికం పరికరాల తయారీ సంస్థ వీఎంసీఎస్ఎల్పై సీబీఐ అధికారులు ఫోర్జరీ, మోసం తదితర సెక్షన్ల కింద 2018లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ ఆడిట్లో అక్రమంగా మరికొన్ని కంపెనీలకు నగదును మళ్లించినట్టు గుర్తించారు. అంతేగాక రూ.692 కోట్లకు నకిలీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ను, ఇతర పత్రాలను సృష్టించినట్టు తేలింది. హిమబిందు తన సోదరుడు, పీఐఎస్ఎల్ కంపెనీ ఎండీ వి సతీశ్కు చెందిన ఖాతాల్లోకి డబ్బులు పంపించినట్టూ కనుగొన్నారు. గత నెల 20న హిమబిందు, సతీశ్, వి మాధవిల ఇండ్లలో సోదాలు సైతం జరిగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, 40 ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, ఆరు మొబైల్స్, రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ హిమబిందు దర్యాప్తునకు సహకరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 18 వరకు ఆమెకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.