ముంబై, మార్చి 21: భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ.. భారత వృద్ధికి మాత్రం ఏ అవరోధం ఉండబోదని మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో ఆర్బీఐ పేర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) వృద్ధిపథంలో వెళ్లగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నిజానికి కరోనా ప్రభావం నుంచి కూడా ఊహించినదాని కంటే వేగంగా దేశ ఎకానమీ కోలుకున్న విషయాన్ని గుర్తుచేసింది. ఇందులోభాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి స్థిరమైన వృద్ధి కనిపిస్తున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.