వచ్చే ఏడాది సంక్షోభ పరిస్థితులే
వరుస వడ్డీరేట్ల పెంపులే కారణం
సీఈబీఆర్ అంచనా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కమ్ముకుంటున్న మాంద్యం మబ్బులు
80 శాతం దేశాల్లో ఆర్థిక సంక్షోభం తప్పదంటున్న ఐఎంఎఫ్
వచ్చే ఏడాది గ్లోబల్ జీడీపీ వృద్ధి 2 శాతం లోపేనన్న అంచనాలు
2037 నాటికి ప్రపంచ ఆర్థిక చోదక శక్తులుగా వర్ధమాన దేశాలు
ప్రపంచ వృద్ధిరేటులో తగ్గనున్న ఐరోపా దేశాల ప్రాధాన్యం
తూర్పు ఆసియా, పసిఫిక్ రీజియన్లోని దేశాలదే ఆధిపత్యం
మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం జారుకుంటున్నది. వచ్చే ఏడాది చాలా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపు పేరుతో పెంచుతున్న వడ్డీరేట్లు ఇందుకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కొత్త ఏడాదిలో మాంద్యం ముంగిట ప్రపంచం మోకరిల్లబోతోందా?.. మెజారిటీ దేశాలు సంక్షోభంలోకి జారుకోబోతున్నాయా?.. అంటే అవుననే అంచనాలే వ్యక్తమవుతున్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను.. ద్రవ్యోల్బణం అదుపు పేరుతో సెంట్రల్ బ్యాంకులు పెంచుతున్న వడ్డీరేట్లు మరింత బలహీనపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే 2023లో ప్రపంచంలోని చాలా దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రిసెర్చ్ (సీఈబీఆర్) హెచ్చరించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు రుణాలను భారం చేస్తున్నాయని, దీనివల్ల ఆయా దేశాల జీడీపీ ఒత్తిడికి లోనై పతనం బాట పడుతున్నదని అంటున్నట్టు బ్లూంబర్గ్ కథనం పేర్కొన్నది.
జీడీపీకి ధరాఘాతం
ప్రపంచ జీడీపీకి ఇప్పుడు ద్రవ్యోల్బణమే అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని తమ వార్షిక ‘వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్’లో సీఈబీఆర్ అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రపంచ జీడీపీ విలువ తొలిసారిగా 100 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిందన్న ఈ బ్రిటీష్ కన్సల్టెన్సీ.. వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత తప్పదని వ్యాఖ్యానించింది. ఇందుకు ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు వరుసగా పెంచుతున్న వడ్డీరేట్లే కారణమని చెప్పింది. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీరేట్ల పెంపునే సెంట్రల్ బ్యాంకులు ఓ పనిముట్టుగా భావిస్తున్నాయన్నది. ఈ విధానం కీలక రంగాల్లో వృద్ధిని క్షీణింపజేస్తున్నదన్నది.
వడ్డీరేట్లు ఇంకా పెరగొచ్చు
ద్రవ్యోల్బణంపై చేస్తున్న పోరులో ఇంకా విజయం దక్కలేదని, కాబట్టి ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను మున్ముందు మరింత పెంచే వీలుందని సీఈబీఆర్ ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణాన్ని ఆమోదయోగ్య స్థాయికి తీసుకురావడానికి ఏండ్ల తరబడి వృద్ధిరేటును బలిపెడుతున్నారని వ్యాఖ్యానించింది. నిజానికి ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భయాందోళనను వ్యక్తం చేసింది. ఇదిలావుంటే 2035 నాటికి భారతీయ ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చన్న అంచనాలున్నాయి. అలాగే 2032లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందంటున్నారు.
‘వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా పెరుగుతున్న వడ్డీరేట్లే ఇందుకు కారణం’
– కే డానియల్ నీఫెల్డ్, సీఈబీఆర్ ప్రధాన విశ్లేషకులు