Festive Season Sales | ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో ఆన్లైన్లో ఏకంగా రూ.65 వేల కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కన్సల్టింగ్ సంస్థ రెడ్ సీర్ పేర్కొంది. ఈ ఏడాది మొత్తంలో ఇప్పటివరకు పండుగల సీజన్లో 9.2 బిలియన్ డాలర్ల విక్రయాలు జరిగిందని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సేల్స్ 23 శాతం పెరిగాయి.
ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ క్రేజీ పెరిగిపోవడంతో ఈ-కామర్స్ వెబ్సైట్లు ప్రత్యేకంగా ఫెస్టివల్ సేల్స్ ప్రకటించడంతో డిమాండ్ కూడా భారీగా ఉంటున్నది. అయితే ఫెస్టివ్ సేల్స్లో మొబైల్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని రెడ్ సీర్ తెలిపింది.
కొత్త మొబైల్ ఫోన్ల మోడల్స్ విపణిలోకి అడుగు పెట్టడంతోపాటు సులువైన పేమెంట్ ఆప్షన్స్ గల ఈఎంఐలతో మొబైల్ ఫోన్స్ సేల్స్ పెరిగాయని రెడ్ సీర్ పేర్కొన్నది. కరోనా మహమ్మారి నియంత్రణకు విధించిన లాక్డౌన్లు ఎత్తేయడంతో చాలా మంది ఇండ్ల నుంచి బయటకు వస్తుండటంతో ఈ ఏడాది ఫ్యాషన్ ఉత్పత్తులకు భారీగా గిరాకీ పెరిగిందని వెల్లడించింది.
హోం అప్లియెన్సెస్, హోం డెకర్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు పెరిగాయని వివరించింది. ఇతర ఈ-కామర్స్ సంస్థలతో పోలిస్తే ఫ్లిప్కార్ట్ 62 శాతం మార్కెట్ వాటా పొందిందని పేర్కొంది.