న్యూఢిల్లీ, జూలై 13: వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఒప్పో సుంకాలు ఎగ్గొట్టినట్టు బయటపడింది. ఈ రెండూ చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలే అవగా.. ఒకే మాతృ సంస్థవి కావడం గమనార్హం. బీబీకే ఎలక్ట్రానిక్స్ అనుబంధ సంస్థలుగానే వివో, ఒప్పో ఉన్నాయి. రియల్మీ, వన్ప్లస్ కూడా ఇదే గ్రూప్నకు చెందినవి. కాగా, ఒప్పో ఇండియా రూ.4,389 కోట్ల దిగుమతి సుంకాలను ఎగవేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతో సదరు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టూ పేర్కొన్నది. ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గువాంగ్డాంగ్ ఒప్పో మొబైల్ టెలీకమ్యూనికేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ)పై దర్యాప్తులో దాదాపు రూ.4,389 కోట్ల కస్టమ్స్ సుంకాల ఎగవేతను రెవిన్యూ ఇంటిలిజెన్స్ శాఖ (డీఆర్ఐ) గుర్తించినట్టు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ కార్యాలయాలు, ప్రధాన ఉన్నతోద్యోగుల ఇండ్లలో జరిపిన సోదాల్లో ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఈ నెల 8న ఒప్పో ఇండియాకు షోకాజ్ నోటీసులూ ఇచ్చామని ఇందులో పేర్కొన్నది.
కొన్ని దిగుమతులు, చైనాసహా పలు బహుళజాతి సంస్థలకు రాయల్టీ, లైసెన్స్ ఫీలకు సంబంధించి ఒప్పో ఇండియా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచి తప్పుడు ప్రకటనలు చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. కాగా, మొబైల్ ఫోన్ల తయారీలో వినియోగించే ఆయా ఉత్పత్తుల దిగుమతుల్ని తక్కువగా చూపడం ద్వారా రూ.2,981 కోట్లు, రాయల్టీ, లైసెన్స్ ఫీజు లావాదేవీల్లో అవకతవకల ద్వారా రూ.1,408 కోట్లు ఒప్పో ఇండియా ఎగ్గొట్టినట్టు అధికార వర్గాలు వివరించాయి. ఒప్పో ఇండియాతోపాటు దాని ఉద్యోగులు, ఒప్పో చైనాలకు కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం నోటీసులు జారీ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సైతం ఒప్పోసహా పలు చైనా మొబైల్ కంపెనీలపై దాడులు నిర్వహించినది తెలిసిందే.
డీఆర్ఐ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఒప్పో ఇండియా స్పందించింది. భిన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఈ వ్యవహారంలో తగువిధంగా ముందుకెళ్తామన్నది. నోటీసులను పరిశీలిస్తున్నామని, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని సంస్థ తెలియజేసింది. ఈ క్రమంలోనే నిజానికి ఈ అంశం మొత్తం పరిశ్రమవ్యాప్తంగా ఉన్నదని తాము భావిస్తున్నట్టు, చాలా కార్పొరేట్లు దీనిపై చర్చిస్తున్నట్టూ వ్యాఖ్యానించింది. అయినప్పటికీ సంబంధిత ప్రభుత్వ శాఖల దర్యాప్తులకు సహకరిస్తామని, తమది బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థ అని ఓ ఈ-మెయిల్ ద్వారా తెలిపింది. కాగా, దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ అమ్మకాలు, పంపిణీల్లో ఒప్పో ఇండియా కార్యకలాపాలు సాగుతున్నాయి.