హైదరాబాద్, జూలై 28: దేశీయ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరిస్ అంచనాలకుమించి లాభాలను నమోదు చేసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,187.60 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.570.80 కోట్ల లాభంతో పోలిస్తే 108 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన ఆరు శాతం అధికమై రూ.4,919.40 కోట్ల నుంచి రూ.5,215.40 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.50 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో రెండింతల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇండివర్ ఇండస్ట్రీస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సెటిల్మెంట్ చేసుకోవడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి పరాగ్ అగర్వాల్ తెలిపారు. సుబోక్జన్ సెటిల్మెంట్ నుంచి రావాల్సిన 72 మిలియన్ డాలర్లలో 50 మిలియన్ డాలర్లు అందినట్లు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరం నుంచి కొవిడ్ ఔషధాల నుంచి ఆదాయం వస్తున్నదని, ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నదని రెడ్డీస్ కో-ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు.