న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న నేరగాడు మెహుల్ చోక్సీని భారత్కు అప్పగింతపై సందేహాల నీలి నీడలు కమ్ముకున్నాయి. పీఎన్బీ స్కామ్ బయటపడకముందే 2018లోనే అంటిగ్వాకు పరారైన మెహుల్ చోక్సీ గత నెల వరకు అక్కడే ఉన్నారు.
ఆయన అప్పగింతకు అంటిగ్వా సర్కార్పై భారత్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది.. అక్కడ ఉండటం క్షేమకరం కాదని డొమినికా మీదుగా క్యూబాకు చెక్కేయాలని చోక్సీ ప్రణాళిక వేసుకున్నట్లు వార్తలొచ్చాయి. చోక్సీ పరారీపై అంటిగ్వా సర్కార్పై ఆ దేశ విపక్షం విరుచుకు పడింది.
దీంతో డొమినికా నుంచి నేరుగా భారత్కు అప్పగించాల్సిందేనని అంటిగ్వా పేర్కొన్నది. భారత్ సమర్పించిన పత్రాలను పరిశీలించిన ఆ దేశ ప్రధాని ప్రధాని గాస్టన్ బ్రౌన్.. భారత్లో చోక్సీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చేశారు.
ఈ నేపథ్యంలో మెహుల్ చోక్సీని అరెస్ట్ చేసేందుకు అంటిగ్వా ఇంటర్ పోల్ సాయం కోరింది. డొమినికా పోలీసులు అరెస్ట్ చేసి, మెహుల్ చోక్సీని జైలుకు పంపారు. కానీ చోక్సీ సోదరుడు చేతన్ చోక్సీ ఎంటరయ్యాక సీన్ మారింది. చోక్సీ న్యాయవాదులు డొమినికా విపక్ష నేతలతో సమావేశమయ్యారన్న వార్తలొచ్చాయి.
చోక్సీ అప్పగింతను అడ్డుకుంటే ఆర్థిక సాయం చేస్తామని డొమినికా విపక్ష నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మెహుల్ చోక్సీ పారిపోలేదని, కిడ్నాప్ చేశారని డొమినికా విపక్ష నేతలను నమ్మించ గలిగారు. వాటి ఒత్తిడికి ఆ దేశ జ్యుడీషియరీ తలొగ్గిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆర్థిక నేరస్థులు బరితెగించడానికి మన దేశంలోని బలహీన చట్టాలే కారణమని కొందరు న్యాయ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. డొమినికా విపక్ష నేతలకు ఆర్థిక లబ్ధి ఆశచూపి భారత్కు రాకుండా ఉండేందుకు మెహుల్ చోక్సీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తున్నది.
అందుకే వెంటనే తేల్చాల్సిన కేసు విచారణను డొమినికా హైకోర్టు వాయిదా వేసింది. దీంతో విచారణ పూర్తి కాగానే చోక్సీని వెంట తీసుకొచ్చేందుకు ప్రైవేట్ జెట్ విమానంలో వెళ్లిన అధికారులు తిరిగి వచ్చేశారు.
మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ లాంటివారిని భారత చట్టాలతో తిరిగి భారత్కు తీసుకురావడం కష్టమని న్యాయ నిపుణులు అంటున్నారు.