హైదరాబాద్, అక్టోబర్ 19: దేశీయంగా పీవీసీకి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్లాంట్ల సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నట్లు అపర్ణ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 700 టన్నుల సామర్థ్యంతో పీవీసీ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్న సంస్థ..వచ్చే ఏడాది చివరిలోగా ఈ కెపాసిటీని 1,100 టన్నులకు పెంచుకోనున్నట్లు కంపెనీ డైరెక్టర్ టీ చంద్రశేఖర్ తెలిపారు. దీంతోపాటు రూ.30 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో పీవీసీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ యూనిట్తో గ్రూపు పీవీసీ కెపాసిటీ నెలకు 2 వేల టన్నులకు పైకి చేరుకోనున్నది. ఈ యూనిట్తో కొత్తగా 100-150 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు హైదరాబాద్లో బాత్రూంకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడానికి రూ.150-200 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే 80 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది.
8.3 శాతానికే బీవోఐ గృహ రుణం
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) గృహ రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది. గృహ రుణంపై వడ్డీరేటును 8.30 శాతానికి కుదించింది. దీంతో లక్ష రూపాయల రుణంపై రూ.755 ఈఎంఐ ప్రారంభంతో లభించనున్నాయి. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుండటంతో ఇతర బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల నుంచి తమ గృహ రుణాన్ని బ్యాంక్కు బదిలీ చేసుకోవచ్చునని సూచించింది. తక్కువ వడ్డీకే రుణం, సులభంగా రుణం, పన్ను ఆదా ప్రయోజనాలు కూడా పొందవచ్చునని తెలిపింది. కొత్తగా ప్లాట్ లేదా నిర్మించిన గృహం, పాత లేదా కొత్త ఫ్లాట్ కొనుగోలుకు వర్తించనున్నది.