నెలల వ్యవధిలో రెండు ఇంక్రిమెంట్లు, బోనస్లు, ప్రమోషన్లు
ముంబై, మే 12:కొవిడ్ ఉత్పాతంతో ఆర్థిక వ్యవస్థతో పాటు పలు రంగాలు అట్టుడికిపోతున్నా, వాక్సిన్లు, ఔషధాల విక్రయంతో ఫార్మా రంగం బంపర్లాభాలు ఆర్జిస్తుండగా, డిజిటలైజేషన్, వ్యయాల తగ్గుదలతో ఐటీ రంగం వెలిగిపోతున్నది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫలితంగా ఐటీ కంపెనీల నిర్వహణా వ్యయాలు గణనీయంగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కొవిడ్తో పెద్ద కార్పొరేట్లు డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టడంతో ఐటీ కంపెనీల వ్యాపారాలు బాగా పుంజుకున్నాయి. దాంతో ఐటీ కంపెనీలు&వాటి ఉద్యోగులకు నెలల వ్యవధిలోనే రెండవరౌండు వేతనాల పెంపుతో పాటు ప్రమోషన్లు ఇస్తున్నాయి. వాస్తవానికి గతేడాది కొత్తగా తలెత్తిన కొవిడ్ సంక్షోభంతో ఐటీ కంపెనీలు ఇంక్రిమెంట్లు వాయిదావేసాయి. 2020 ద్వితీయార్థంలో ఐటీ కంపెనీల వ్యాపారం పుంజుకోవడంతో ఆ ఏడాది చివర్లో ఇంక్రిమెంట్లు ఇచ్చాయి. మెరుగైన ఐటీ నిపుణుల కోసం ప్రస్తుతం పోటీ పెరుగుతున్న కారణంగా కంపెనీలు మళ్లీ ఉద్యోగులకు ప్రోత్సాహకాలిస్తున్నాయి…
యాక్సెంచర్ ఇండియా
2 లక్షల మంది ఉద్యోగులు కలిగిన యాక్సెంచర్ ఇండియా గత డిసెంబర్లో వార్షిక శాలరీ ఇంక్రిమెంట్లు, బోనస్లు, ప్రమోషన్లు ఇచ్చి, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో రౌండు ప్రమోషన్లు అందించింది. ఇక ఈ ఏప్రిల్లో అసోసియేట్ డైరెక్టర్ స్థాయివరకూ ఉద్యోగులందరూ ‘థ్యాంక్యూ బోనస్’గా వారం రోజుల వేతనాన్ని తీసుకున్నారు. గతేడాది ప్రమోషన్లు పొందినవారిలో అధికంగా మహిళలు వున్నారు.
హెచ్సీఎల్ టెక్
సాధారణంగా ప్రతీ జూలైలోనూ ఇంక్రిమెంట్లు ఇచ్చే హెచ్సీఎల్ టెక్ గతేడాది ఒక త్రైమాసికంపాటు జాప్యం చేసింది. ఈ ఏడాది మామూలుగానే జూలైలో వేతనాల పెంపు వుంటుందని, ఇది 7-8 శాతం వుండవచ్చని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ అప్పారావు వివి సూచనాప్రాయంగా వెల్లడించారు.
టెక్ మహింద్రా
ఇటీవలే అప్రయిజల్ సైకిల్ను పూర్తిచేసిన టెక్ మహింద్రా ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా వేతనాల పెంపును ప్రకటించింది. కీలకమైన ఐటీ నిపుణులకు రిటెంన్షన్ బోనస్ను ప్రవేశపెట్టామని, నైపుణ్యం ఆధారంగా అలెవెన్సులు, ప్రాజెక్ట్ బేస్డ్ బోనస్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవర్ధన్ సోయిన్ తెలిపారు.
విప్రో
కంపెనీ వృద్ధి మందగించకుండా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో పాటు సైప్లె చైన్ సజావుగా సాగేలా అన్ని చర్యలూ చేపడుతున్నామని, ఈ ఏడాది జూన్లో వేతనాల పెంపు వుంటుందని విప్రో సీఈఓ థియరీ డెల్పోర్టే ఇటీవల ఒక కాన్ఫెరెన్స్ కాల్లో వెల్లడించారు.
ఇన్ఫోసిస్
గతేడాది ఇంక్రిమెంట్లను దాదాపు నిలిపివేసిన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఈ ఏడాది జనవరిలో వేతనాలు పెంచింది. అలాగే రెండోరౌండు ఇంక్రిమెంట్లకు ప్రస్తుతం సమీక్ష జరుగుతున్నదని, పనితీరు ఆధారంగా జీతాల పెంపును కూడా సమీక్షిస్తున్నామని, ఈ రెండు సమీక్షల ఆధారంగా ఉద్యోగులందరికీ జూలై నుంచి అమలులోకి వచ్చేలా మరో వేతనాల పెంపు వుంటుందని కంపెనీ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో చెప్పారు. రెండు ఇంక్రిమెంట్లు కలిపి 10-14 శాతం వరకూ వుండవచ్చని ఆయన సూచనాప్రాయంగా వెల్లడించారు.
టీసీఎస్
మార్కెట్ విలువ ప్రకారం దేశంలోకెల్లా టాప్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ ఆరునెలల వ్యవధిలో రెండుదఫాలు వేతనాల్ని పెంచింది. అన్ని దేశాల్లో వున్న కంపెనీ ఉద్యోగులందరికీ ఈ ఏప్రిల్లో రెండో ఇంక్రిమెంట్ అందింది. పలు సీనియర్ ఉద్యోగులకు 6-8 శాతం మధ్య వేతనాలు పెరిగాయని, ఇది సాధారణ పెంపుకంటే అధికమేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.