న్యూఢిల్లీ, డిసెంబర్ 28: మొబైల్ ఫోన్ల కాల్ డ్రాప్స్, కాల్ కనెక్టివిటీ వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై టెలికం శాఖ (డాట్) ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్స్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో కాల్ నాణ్యతను, టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం డాట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశమయ్యింది. టెలికం కార్యదర్శి కే రాజారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలతో సహా టెలికం ఆపరేటర్లు హాజరయ్యారు.
చట్టవిరుద్దమైన బూస్టర్లు, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను సమావేశంలో చర్చించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ప్రస్తుతం అందిస్తున్న సేవల నాణ్యతపై డాట్కు ఆపరేటర్లు ప్రెజంటేషన్ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమస్యాత్మక అంశాల్ని గుర్తించి, కాల్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన విధానపర చర్యలపై సూచనలివ్వాలని ఆపరేటర్లను టెలికం శాఖ అధికారులు కోరినట్టు ఆ వర్గాలు వివరించాయి.