Aadhaar @ Door Step | భారతీయుడి గుర్తింపునకు ఆధార్ను కీలకంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) త్వరలో ఇంటింటికి ఆధార్ సేవ చేపట్టనున్నది. ఇంటింటికి ఆధార్ సేవ కోసం యూఐడీఏఐ ఇప్పటికే 48 వేల మంది పోస్ట్మన్లకు శిక్షణ ఇచ్చింది.
12-డిజిట్ యూనిక్ ఆధార్ నంబర్ జారీ చేయాల్సిన బాధ్యత విశిష్ట ప్రాధికార సంస్థదే. ఈ ప్రక్రియ చేపట్టేందుకు దేశవ్యాప్తంగా పోస్ట్మన్లకు యూఐడీఏఐ శిక్షణ ఇస్తున్నది. ఈ శిక్షణతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)లోని పోస్ట్మన్లు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ఇంటింటికి తిరిగి మొబైల్ ఫోన్ నంబర్లతో ఆధార్ నంబర్ లింక్, డిటైల్స్ అప్డేట్, ఇండ్ల వద్ద పిల్లల పేర్ల నమోదు ప్రక్రియ చేపడతారు.
అత్యధిక మంది వద్దకు ఆధార్ సేవలను తీసుకెళ్లడం.. పౌరులందరి పేర్ల రిజిస్ట్రేషన్ లక్ష్యంగా విశిష్ట ప్రాధికార సంస్థ విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్నది. రెండో దశలో దేశవ్యాప్తంగా 1.50 లక్షల పోస్టాఫీసులను భాగస్వాములను చేయనున్నది. ఐపీపీబీ పోస్ట్మన్లతో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులో.. పిల్లల పేర్లను మొబైల్ బేస్డ్ కిట్తో టాబ్లెట్ ఉపయోగించి నమోదు చేస్తారు. లాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉపయోగించి మారుమూల ప్రాంతంలో ఆధార్ డిటైల్స్ అప్డేట్ చేయొచ్చు.
ఐపీపీబీ పోస్ట్మన్లతోపాటు విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్తగా 13 వేల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా విశ్వాసంలోకి తీసుకోనున్నది. ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని కామన్ సర్వీస్ సెంటర్తో పని చేస్తున్నారు.