ముంబై, మార్చి 29: తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను లాభాల్లోకి మళ్లించాయి. సెన్సెక్స్ 346 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 17 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది.
సేవలు, రియల్టీ, కమోడిటీ, వాహన రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 346.37 పాయింట్లు లాభపడి 57,960.09 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడిన సూచీ చివరకు ఈ స్థాయిలో లాభాలను నిలుపుకోలేక పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 129 పాయింట్లు అందుకొని 17,080.70 వద్ద స్థిరపడింది.