ముంబై, జనవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు 2024 సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. తీవ్ర ఊగిసలాట మధ్యలో కదలాడిన సూచీలు చివర్లో స్వల్పంగా కోలుకున్నాయి. ఇంట్రాడేలో 72,561.91 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 72,271.94 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో సూచీ 31.68 పాయింట్లు లాభపడినట్టు అయింది. ఇంట్రాడేలో రికార్డు స్థాయికి చేరుకున్న నిఫ్టీ 10.50 పాయింట్లు అందుకొని 21,741.90 వద్ద నిలిచింది. 28 నిఫ్టీ షేర్లలో 22 షేర్లు కిందకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో సూచీలు భారీగా పతనమయ్యాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
మార్కెట్లో అత్యధికంగా నెస్లె, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీ, టాటా మోటర్స్, విప్రో, ఐటీసీల షేర్లు లాభాల్లో ముగియగా..భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యునిలీవర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, టెలికమ్యూనికేషన్, సేవలు, కమోడిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండస్ట్రీయల్స్ రంగ సూచీలు కదం తొక్కగా..ఆటో, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలు నష్టపోయాయి. 2023లో బీఎస్ఈ సెన్సెక్స్ 11,399.52 పాయింట్లు లేదా 18.73 శాతం, నిఫ్టీ 3,626.1 పాయింట్లు లేదా 20 శాతం చొప్పున పెరిగాయి.