ఐటీ షేర్ల ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను సంతరించుకున్నాయి.మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేయడంతో సూచీలు సరికొత్త స్థాయికి చేరాయి. ఆల్టైమ్ హై రికార్డుల్ని నెలకొల్పాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.373 లక్షల కోట్లను తాకింది. గత నాలుగు రోజుల్లోనే మదుపరుల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లదాకా ఎగిసింది మరి.
Stock Market | ముంబై, జనవరి 12: ఉదయం మొదలు.. మధ్యాహ్నం ముగిసేదాకా దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ శుక్రవారం అదిరిపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 1 శాతానికిపైగా పుంజుకుని ఆల్టైమ్ హై రికార్డులతో హోరెత్తించాయి. మదుపరులను ఐటీ షేర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఉండటంతో పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 847.27 పాయింట్లు లేదా 1.18 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 72,568.45 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 247.35 పాయింట్లు లేదా 1.14 శాతం ఎగబాకి 21,894.55 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే సెన్సెక్స్ 999.78 పాయింట్లు, నిఫ్టీ 281.05 పాయింట్లు పెరిగాయి. దీంతో నయా ఇంట్రా-డే హై రికార్డులు నమోదయ్యాయి. తొలిసారిగా అటు సెన్సెక్స్ 72,720.96 స్థాయికి, ఇటు నిఫ్టీ 21,928.25 స్థాయికి చేరాయి. ఇక ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 542.3 పాయింట్లు, నిఫ్టీ 183.75 పాయింట్లు పెరిగాయి.
శుక్రవారం జరిగిన స్టాక్స్ ర్యాలీలో టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు కీలకంగా నిలిచాయి. టీసీఎస్ షేర్ విలువ 3.89 శాతం పెరిగి బీఎస్ఈలో రూ.3,881.70 వద్దకు చేరింది. ఇంట్రా-డేలో 4.53 శాతం ఎగబాకి రూ.3,905.75ను తాకడం విశేషం. ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.53,239.2 కోట్లు ఎగిసి రూ.14,20,333.97 కోట్లకు వచ్చినట్టు తేలింది. ఇక ఇన్ఫోసిస్ షేర్ విలువ 7.84 శాతం పుంజుకుని రూ.1,612.20 వద్ద ఉన్నది. దీంతో సంస్థ మార్కెట్ విలువ రూ.48,652.73 కోట్లు పెరిగి రూ.6,69,135.15 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఇరు సంస్థల ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్యూ3లో టీసీఎస్ రూ.11,735 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.6,106 కోట్ల లాభాల్ని అందుకున్నది తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా ప్రధాన మార్కెట్లలో జపాన్ లాభాల్లో ముగిసింది. దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. అయితే ఐరోపా మార్కెట్లలో కీలకమైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం లాభాల్లోనే ముగిశాయి. ఇదిలావుంటే బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 0.41 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.36 శాతం చొప్పున లాభపడ్డాయి. రంగాలవారీగా ఐటీ అత్యధికంగా 5.06 శాతం, టెక్నాలజీ 4.40 శాతం, రియల్టీ 1.93 శాతం, చమురు-గ్యాస్ 1.71 శాతం, ఎనర్జీ 1.09 శాతం, టెలికం 0.77 శాతం పెరిగాయి.
మదుపరులు పెట్టుబడుల దిశగా పరుగులు పెట్టడంతో ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.2.76 లక్షల కోట్లు ఎగిసింది. అంతకుముందు మూడు రోజులూ సూచీలు లాభాల్లోనే ముగియడంతో ఈ నాలుగు రోజుల్లో మదుపరుల సంపద రూ.6,88,711.19 కోట్లు ఎగబాకినైట్టెంది. దీంతో ప్రస్తుతం బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,73,29,676.27 కోట్లకు చేరింది. ఈ వారంలో సోమవారం మినహా మిగతా నాలుగు రోజులు సూచీలు లాభాలనే అందుకున్నాయి. అయితే సోమవారం భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 671, నిఫ్టీ 198 పాయింట్లు క్షీణించాయి. ఈ ఏడాది మొదలు ఇదే అత్యధికం కావడం గమనార్హం.