ముంబై, సెప్టెంబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. రోజుకొక రికార్డు స్థాయిలో చేరుకుంటున్న సూచీలు శుక్రవారం చారిత్రక గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. గత పదకొండు రోజులుగా లాభపడుతున్న సూచీలకు మదుపరుల నుంచి విశేష మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ కొనసాగడంతోపాటు దేశీయ ఈక్విటీలలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు రికార్డు స్థాయిలో ముగిశాయి.
వీటికితోడు టెలికం, వాహన, టెక్నాలజీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇంట్రాడేలో 408 పాయింట్లు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 319.63 పాయింట్ల ఎగబాకింది. వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 67,838.63 వద్ద ముగిసింది. సూచీకి ఇదే గరిష్ఠ స్థాయి ముగింపుకావడం విశేషం. ఎన్ఎస్ఈ నిఫ్టీ 89.25 పాయింట్లు లాభపడి 20,192.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 119 పాయింట్లు ఎగబాకి లైఫ్టైం ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 20,222.45 వద్దకు చేరుకున్నది.