ముంబై, మార్చి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా 8 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. బుధవారం కోలుకున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తిరిగి నష్టాల బాటలోనే నడిచాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 501.73 పాయింట్లు లేదా 0.84 శాతం పడిపోయి 58,909.35 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 544.82 పాయింట్లదాకా పతనమై 58,866.26 వద్దకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 129 పాయింట్లు లేదా 0.74 శాతం దిగజారి 17,321.90 వద్ద స్థిరపడింది.
టెక్నాలజీ, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 1.33 శాతం, 1.24 శాతం చొప్పున నష్టపోయాయి. బ్యాం కింగ్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లూ నిరాశపర్చాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీ లూ 0.22 శాతం, 0.13 శాతం చొప్పున క్షీణించాయి. ఇదిలావుంటే హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో కుప్పకూలిన అదానీ గ్రూప్ సంస్థల షేర్లు.. నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఈ సంస్థల మార్కెట్ విలువ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది. ఇక ఆసియా దేశాల్లో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు పడిపోయాయి. దక్షిణ కొరియా సూచీ మాత్రం లాభపడింది. మరోవైపు ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్లు నేలచూపుల్నే చూస్తున్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐ) దేశీయ మార్కెట్ల నుంచి బుధవారం రూ.424.88 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.