ముంబై, మే 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస పతనాలకు బ్రేక్ పడింది. వరుసగా ఆరు రోజులుగా పతనమవుతున్న సూచీలు సోమవారం తిరిగి లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో ట్రేడ్ అయినప్పటికీ బ్యాంకింగ్, వాహన, పవర్ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడంతో తిరిగి లాభాల్లోకి వచ్చాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 180.22 పాయింట్లు అందుకొని 52,973.84 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 630 పాయింట్లకు పైగా లాభపడిన సూచీ చివరకు ఇంతటి స్థాయి లాభాలను నిలుపుకోలేక పోయింది. ఐటీ, బ్లూచిప్ రంగ సంస్థల షేర్లు ప్రాఫిట్ బుకింగ్ 800 పాయింట్ల శ్రేణిలో సూచీ కదలాడింది. అటు ఎన్ఎన్ఈ నిఫ్టీ 60.15 పాయింట్లు పెరిగి 15,842.30 వద్ద నిలిచింది.
ఎన్టీపీసీ 3 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు బజాజ్ఫైనాన్స్, ఎస్బీఐ, మారుతిల షేర్లు రెండు శాతం వరకు లాభపడ్డాయి.
వీటితోపాటు హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, సన్ఫార్మాలు లాభపడ్డాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, రిలయన్స్లు నష్టపోయాయి.
గడిచిన ఆరు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు 5 శాతం వరకు పతనం చెందాయి. ఎఫ్పీఐలు నిధులు ఉపసంహరించుకోవడం, ద్రవ్యోల్బణ భయాలు చుట్టుముట్టడం మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి.
ఏసీసీ, అంబుజా సిమెంట్లో హోల్సిమ్ లిమిటెడ్ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు గౌతమ్ అదానీ గ్రూపు షేర్లు భారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 2.59 శాతం, అదానీ పవర్ 4.99 శాతం అధికమయ్యాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్ 1.51 శాతం, బీఎస్ఈ స్మాల్క్యాప్ 1.15 శాతం చొప్పున పెరిగాయి.
రంగాలవారీగా చూస్తే టెలికం 2.85 శాతం, ఆటో 2.2 శాతం, యుటిలిటీ 2.17 శాతం, పవర్ 2.1 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.44 శాతం, ఫైనాన్స్ 1.45 శాతం, బ్యాంకింగ్ 1.43 శాతం, ఐటీ, టెక్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు అధికమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర స్వల్పంగా తగ్గి 111 డాలర్ల వద్ద ముగిసింది.