ముంబై, సెప్టెంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. బుధవారం సైతం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ దూకుడు కొనసాగింది. నిజానికి ఉదయం ఆరంభంలో తడబడినా.. మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో ఆఖర్లో లాభాలనే అందుకున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకింగ్, మెటల్, టెలికం, ఎనర్జీ రంగాల షేర్లు ఇన్వెస్టర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా తొమ్మిదో రోజూ సెన్సెక్స్ లాభాల్లోనే ముగిసింది. గడిచిన ఐదు నెలల్లో ఇన్ని రోజులు వరుసగా సూచీ లాభపడటం ఇదే తొలిసారి. కాగా, సెన్సెక్స్ 245.86 పాయింట్లు లేదా 0.37 శాతం పుంజుకుని 67,466.99 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 67,565.41 స్థాయిని తాకింది. సూచీలోని మొత్తం 30 షేర్లలో 20 లాభాల్లోనే స్థిరపడ్డాయి. ఇక నిఫ్టీ 76.80 పాయింట్లు లేదా 0.38 శాతం ఎగిసి ఆల్టైమ్ హైని తాకుతూ 20,070 వద్ద ఆగింది. ఇందులోని 50 షేర్లలో 31 లాభాల్లోనే ఉన్నాయి.
టెలికం షేర్లు ఆకర్షణీయం
టెలికం షేర్లు 1.24 శాతం పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ షేర్ విలువ అత్యధికంగా 2.72 శాతం ఎగిసింది. టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఎనర్జీ 1.19 శాతం, చమురు-గ్యాస్ 1.13 శాతం, మెటల్ 1.04 శాతం, కమోడిటీస్ 0.96 శాతం, బ్యాంకింగ్ 0.89 శాతం చొప్పున పెరిగాయి. ఇండస్ట్రీయల్స్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్ షేర్లు నష్టాలకే పరిమితమయ్యాయి.
స్మాల్-మిడ్క్యాప్కూ ఆదరణ
బడా షేర్లతోపాటు మధ్య, చిన్న శ్రేణి షేర్లలోనూ మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 0.85 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.19 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. ఇక ఆసియా ప్రధాన మార్కెట్లలో దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. జపాన్ మాత్రం లాభపడింది. ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నిరాశపర్చాయి. మంగళవారం అమెరికా సూచీలూ నష్టాలకే పరిమితమైన సంగతి విదితమే.