Stock Markets | ముంబై, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫిచ్ దెబ్బ గట్టిగానే తగిలింది. విదేశీ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. అమెరికా ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్ను తగ్గిస్టున్నట్లు ఫిచ్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లలో అలజడి సృష్టించింది. ఏఏఏ నుంచి ఏఏ+కు తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. వీటితో పాటు దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 676.53 పాయింట్లు లేదా 1.02 శాతం నష్టపోయి 65,782.78 వద్దకు జారుకున్నది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 207 పాయింట్లు లేదా 1.05 శాతం నష్టపోయి 19,526.55 వద్దకు పడిపోయింది.
నెస్లె, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్లు లాభాల్లో ముగిశాయి.
టాటా స్టీల్ 3.45 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు టాటా మోటర్స్, బజాజ్ ఫిన్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్టీ, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్గ్రిడ్, ఐటీసీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి.
వీటితోపాటు విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మారుతి, సన్ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, మహీంద్రా, టీసీఎస్లకు కూడా మదుపరుల నుంచి మద్దతు లభించలేదు.
రంగాలవారీగా చూస్తే అత్యధికంగా మెటల్ 2.45 శాతం నష్టపోగా..యుటిలిటీ 2.32 శాతం, పవర్ 2.31 శాతం, టెలికం 2 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.83 శాతం, వాహన 1.52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, ఆర్థిక సేవలు, కమోడిటీస్ షేర్లు నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు మదుపరులకు చుక్కలు చూపించింది. రూ.3.46 లక్షల కోట్ల సంపదను నష్టపోయాయి. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.3,46,947.54 కోట్లు కరిగిపోయి రూ.3,03,33,258.69 కోట్లుగా నమోదైంది. అయినప్పటికీ బీఎస్ఈ లిైస్టెన సంస్థల విలువ రికార్డు స్థాయిలోనే ఉన్నది. జూన్, జూలై నెలలో ఆశాజనక పనితీరు కనబరిచిన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం కరెక్షన్కు గురయ్యాయి.