LPG Cylinder | గత నాలుగేండ్లలో వంటగ్యాస్ సిలిండర్ ధర 56 శాతం పెరిగిపోయింది. మరోవైపు దాదాపు సబ్సిడీ పూర్తిగా ఎత్తేసింది కేంద్రం. తాజాగా ఈ నెల ఒకటో తేదీన రూ.50 పెంచడంతో మొత్తం గ్యాస్ సిలిండర్ ధర రూ.1150లకు చేరింది. దీనికి తోడు తొలి నుంచి ఇస్తున్న సబ్సిడీలో భారీగా కోత విధించింది కేంద్రం. వంటగ్యాస్ సిలిండర్ ధర 2019 ఏప్రిల్ ఒకటో తేదీన రూ.706.50. 2020లో రూ.744కి, 2021లో 809, 2022లో రూ.949.50కి చేరింది. ఈ నెల ఒకటో తేదీన రూ.50 పెంచేస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడంతో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1150కి చేరింది. గత కొన్నేండ్లుగా వంట గ్యాస్ సిలిండర్ ధర గణనీయంగా పెరుగుతూ ఉంటే, దానిపై మొత్తం సబ్సిడీ కూడా అదే స్థాయిలో తగ్గిపోతున్నదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఎల్పీజీ సిలిండర్పై గత నాలుగేండ్లలో ఇస్తున్న మొత్తం సబ్సిడీలో కేంద్రం భారీగా కోత విధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వంటగ్యాస్ సిలిండర్లకు రూ.37,209 కోట్లు కేంద్రం సబ్సిడీ కేటాయించింది. అది 2019-20లో రూ.24,172 కోట్లకు పడిపోయింది. 2020-21లో మరింత తగ్గి రూ.11,896 కోట్లు కేటాయించిన కేంద్రం.. 2021-22లో కేవలం రూ.1,811 కోట్లే కేటాయించింది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఎల్పీజీతోపాటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఖరారు చేస్తున్నట్లు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ తెలిపింది. సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకునే వంట గ్యాస్ కాంట్రాక్ట్ ప్రైస్ టన్నుకు 2019-20 నుంచి 2021-22 వరకు 454 టన్నుల నుంచి 693 టన్నులకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గత నెల వరకు సౌదీ గ్యాస్ కాంట్రాక్ట్ ప్రైస్ టన్నుకు 710 డాలర్లకు పెరిగింది. దేశీయంగా వంట గ్యాస్ విక్రయాల వల్ల కేంద్ర చమురు సంస్థలు భారీ నష్టాలను చవి చూస్తున్నాయని ఇటీవల పార్లమెంట్కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర చమురుశాఖ తెలిపింది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం 2016లో మొదలైంది. ఈ పథకం కింద పేద కుటుంబాల మహిళలకు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు కల్పించింది కేంద్రం. ఉజ్వల 2.0 కింద పీఎంయూవై లబ్ధిదారులందరికీ తొలి గ్యాస్ సిలిండర్తోపాటు ఉచితంగా స్టవ్ పంపిణీ చేశారు. 2023 ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి ఉజ్వల 2.0 కింద 1.6 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయి కేంద్ర గ్యాస్ కంపెనీలు.
కరోనా మహమ్మారి వేళ 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉజ్వల లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజేకేపీ) కింద మూడు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేశారు. పీఎంయూవై లబ్ధిదారులకు 14.17 కోట్ల సిలిండర్లు సరఫరా చేసినందుకు ఆయా ఖాతాదారులకు కేంద్ర చమురు మార్కెటింగ్ సంస్థలు రూ.9670.41 కోట్ల సబ్సిడీ ట్రాన్స్ఫర్ చేశాయి. తదుపరి పీఎంయూవై లబ్ధిదారుల్లో ఎల్పీజీ వాడకాన్ని పెంపొందించేందుకు గతేడాది మే నుంచి ప్రతి సిలిండర్పై రూ.200 సబ్సిడీ అందిస్తున్నది. ఏటా 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది.
వంటగ్యాస్ సిలిండర్ల విక్రయం వల్ల కేంద్ర చమురు మార్కెటింగ్ కంపెనీలకు భారీ నష్టం వచ్చిందని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు వన్టైం సెటిల్మెంట్ కింద రూ.22 వేల కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.