April Financial Changes | సోమవారం నుంచి 2024లో ఏప్రిల్ నెల ప్రారంభం అవుతుంది. భారత్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం (2024-25) కూడా మొదలవుతుంది. ఆర్థిక సంవత్సరంతోపాటు ఆర్థికపరమైన అంశాల్లోనూ కొన్ని నిబంధనలు, మార్పులు జరుగబోతున్నాయి. ఎన్పీఎస్ లాగిన్ తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ చార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకున్నది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎన్పీఎస్ సిస్టమ్ లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) లోకి వెళ్లాల్సి ఉంటది. ఈ విషయమై 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు చార్జీలు పెంచేసింది. పెంచిన కొత్త చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెరిగింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది. పెరిగిన చార్జీలపై అదనంగా జీఎస్టీ పే చేయాల్సి ఉంటది.
ఇప్పటి వరకూ అద్దె చెల్లింపులపై రివార్డు పాయింట్లు అందిస్తున్న ఎస్బీఐ కార్డు ఇక నుంచి ఆ రివార్డులు ఇవ్వదు. అరూమ్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ కార్డుల వాడకం దారులపై ప్రతికూల ప్రభావం ఉంటది.
ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల యజమానులు ఇంతకుముందు త్రైమాసికంలో ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ అవుతుంది.
ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.
ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేస్తారు. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్దతిలోనే అందించాల్సి ఉంటది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది.